భారత జట్టులో పోటీతత్వం ఎక్కువగా ఉండటంతోనే వన్డే సిరీస్కు సంజూ శాంసన్ ఎంపిక కాలేకపోయాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్లను ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్లో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్... వన్డే టీమ్లో మాత్రం అవకాశాన్ని అందుకోలేకపోయాడు. వన్డే ఫార్మాట్కు సంజూ శాంసన్ను దూరం పెట్టడంపై హర్భజన్ సింగ్ వంటి సీనియర్ ఆటగాళ్లు తప్పుబట్టారు.
జూలై 27న జరిగే తొలి టీ20తో టీమిండియా.. శ్రీలంక పర్యటన ప్రారంభం కానుండగా.. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సోమవారం(జూలై 22) మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. జట్ల ఎంపిక, భవిష్యత్తు ప్రణాళికలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఈ ఇద్దరూ ఓపికగా సమాధానం చెప్పారు.

ఇటీవలే ముగిసిన జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలతో పాటు వన్డే సిరీస్కు సంజూ శాంసన్ను దూరం పెట్టడంపై అగర్కార్ను మీడియా ప్రతినిథుల ప్రశ్నించారు. అయితే ప్రతీ ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేయడం కుదురదని అగార్కర్ బదులిచ్చాడు.
రుతురాజ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్లే కాదు.. ఇతర ఆటగాళ్లు కూడా జట్టులో స్థానం కోల్పోతే బాధపడుతారని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో రింకూ సింగ్ కూడా ఇలా బాధనే అనుభవించాడని గుర్తు చేశాడు. కొన్నిసార్లు అద్భుత ప్రదర్శన చేసినా.. జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమని తెలిపారు.
'ఏ ఆటగాడైనా జట్టులో చోటు కోల్పోతే కష్టంగానే ఉంటుంది. రింకూ సింగ్ను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. టీ20 ప్రపంచకప్ ముందు రింకూ సింగ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. కానీ అతనికి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. సెలెక్టర్లుగా జట్టులోకి 15 మంది ఆటగాళ్లను మాత్రమే తీసుకోగలం. టీమ్ కాంబినేషన్కు తగ్గట్లు ఆటగాళ్లను ఎంపిక చేస్తాం. ఈ క్రమంలో కొన్నిసార్లు అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అవకాశం దక్కదు. అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ల పరిస్థితి కూడా ఇదే'అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు.
టీ20ల్లో వికెట్ కీపర్లు సంజూ శాంసన్, రిషభ్ పంత్ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. వన్డేల్లో మాత్రం రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ను తీసుకున్నారు. దాంతో సంజూ శాంసన్కు అవకాశం దక్కలేదు.
టీమిండియా టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
టీమిండియా వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.