టీమిండియా ఆటగాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడానికి బీసీసీఐ స్కూల్ కాదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టును అగార్కర్ ప్రకటించాడు. జట్టు ఎంపికపై కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శనివారం సుదీర్ఘ సమావేశం నిర్వహించిన అగర్కార్ అనంతరం.. హిట్ మ్యాన్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించాడు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రోహిత్తో కలిసి సమాధానాలిచ్చాడు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ కొత్తగా 10 రూల్స్ తీసుకొచ్చిందనే విషయాన్ని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అగర్కార్ తనదైన శైలిలో బదులిచ్చాడు.

ఆటగాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడానికి ఇదేం స్కూల్ కాదని చురకలంటించాడు. అవి రూల్స్ మాత్రమేనని, పనిష్మెంట్ కాదని స్పష్టం చేశాడు. గత కొన్ని నెలలుగా టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చడంతో తాము కొన్ని మార్పులు చేయాలనుకున్నామని తెలిపాడు. 'నాకు తెలిసి ప్రతీ జట్టుకు కొన్ని రూల్స్ ఉంటాయి. సమీక్ష సమావేశంలో మేం చాలా విషయాల గురించి మాట్లాడాం. గత కొన్ని నెలలుగా టీమిండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో కొన్ని మార్పులు చేయడంతో పాటు టీమ్ బాండింగ్ పెంచాలనుకున్నాం.
ఇదేం స్కూల్ కాదు. ఈ రూల్స్ పనిష్మెంట్ కాదు. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల కోసం కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఎవరైనా పాటించాల్సిందే. ఆటగాళ్లేం స్కూల్ పిల్లలు కాదు. వాళ్లంతా సూపర్ స్టార్స్. వారిని వారు ఎలా సమన్వయపరుచుకోవాలో వారికి బాగా తెలుసు. అయితే ఎవరైనా దేశం కోసం ఆడుతున్నప్పుడు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అక్కడ చాలా రూల్స్ ఉండేవి. కాలానుగుణంగా అవి మారుతూ వస్తున్నాయి.'అని అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.
టీమిండియా ఘోర పరాజయాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన రూల్స్ను అమలు చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలతో డ్రెస్సింగ్ రూమ్ను సెట్ చేసేందుకు ఏకంగా 10 కొత్త రూల్స్ను తీసుకొచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ వివరాలను బీసీసీఐ అధికారికంగా విడుదల చేయకపోయినా.. బోర్డు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని జాతీయ మీడియా పేర్కొంది. ఈ రూల్స్ పాటించని ఆటగాళ్లకు భారత జట్టుతో పాటు ఐపీఎల్లో చోటు దక్కదని ప్రచారం జరుగుతోంది.
ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బందిని అనుమతించడంపై ఆంక్షలు విధించారని, ప్రాక్టీస్ మధ్యలో వెళ్లడం.. మ్యాచ్ల సందర్భంగా సొంత వాహనాల్లో ప్రయాణించడంపై నిషేధం విధించినట్లు, ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలనే రూల్స్ను తీసుకొచ్చినట్లు జోరుగా ప్రచారం జరగుతోంది. ఈ రూల్స్ గురించే అగార్కర్ ముందు ప్రస్తావించగా.. అతను అంగీకరిస్తూనే.. ఇవి పనిష్మెంట్ కాదనే మాటను నొక్కి చెప్పారు.