టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆకస్మికంగా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందే ఈ ఇద్దరూ వారం వ్యవధిలోనే సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకడం అనేక సందేహాలకు దారి తీసింది. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటనకు సిద్దంగా ఉన్నానని రోహిత్ చెప్పిన కొద్ది రోజులకే అతను ఆటకు టాటా చెప్పడం మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలతోనే ఈ ఇద్దరూ ఆట నుంచి తప్పుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్పై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.
తాజాగా టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. కోహ్లీ, రోహిత్లను తాము ఇంగ్లండ్ పర్యటనలో ఆడించాలనుకున్నామని, కానీ వారే ఆటకు వీడ్కోలు పలికారని చెప్పాడు. రిటైర్మెంట్ వారి వ్యక్తిగత నిర్ణయమని, ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు.
'కోహ్లీ, రోహిత్ టీమిండియాకు రెండు పిల్లర్స్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 27 కొత్త ఎడిషన్ ప్రారంభమవుతుండటంతో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని ఈ ఇద్దరూ భావించారు. రిటైర్మెంట్ వారి వ్యక్తిగత నిర్ణయం. నిజం చెప్పాలంటే ఇంగ్లండ్ పర్యటనలో అనుభవం కలిగిన కోహ్లీ, రోహిత్ ఉండాలనుకున్నాం. ఈ సిరీస్ గెలవకపోయినా శుభ్మన్ గిల్ సారథ్యంలోని యువ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది.'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.

అయితే రిటైర్మెంట్ ప్రకటించకుండా కోహ్లీ, రోహిత్లను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారా? అంటే సమాధానం చెప్పేందుకు గవాస్కర్ నిరాకరించాడు. అది సీక్రెట్ అని, చెప్పనని తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటనకు 15 రోజుల ముందు ఈ సిరీస్ గురించి రోహిత్ శర్మ చేసిన పోస్ట్ గురించి ప్రస్తావించగా.. తనకు తెలియదని అగార్కర్ బదులిచ్చాడు. తాను ఆటగాళ్లతోనే మాట్లాడుతానని, సోషల్ మీడియ పోస్ట్ల గురించి తనకు తెలియదన్నాడు. రిటైర్ అయిన ఆటగాళ్ల గురించి మాట్లాడే బదులు.. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన జట్టు గురించి మాట్లాడుదామని హితవు పలికాడు. జట్టులో పాత ఆటగాళ్లు పోయి కొత్త ప్లేయర్లు రావడం సహజమని అగార్కర్ అభిప్రాయపడ్డాడు.
'సీనియర్ ఆటగాళ్లు రిటైర్ కావడం.. యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం సహజం. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. 200 టెస్ట్ మ్యాచ్లు ఆడిన సచిన్ కూడా ఆట నుంచి తప్పుకున్నాడు. అది ఆట స్వభావం. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా మార్పు ఉండాలి. అలా చేయడమే సెలెక్టర్లుగా మా పని.'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పుడే ఆ టోర్నీ గురించి మాట్లాడటం సరికాదన్నాడు. కోహ్లీ, రోహిత్లు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారని, ట్రోఫీలు గెలిచారని గుర్తు చేశాడు. ఆస్ట్రేలియాతో ఒక్క సిరీస్లో విఫలమైనంత మాత్రాన వారిని పక్కనపెట్టలేమని, భారీ పరుగులు చేసినా ప్రపంచకప్ గురించి ఆలోచించేది లేదని అగార్కర్ స్పష్టం చేశాడు. మహమ్మద్ షమీకి ఏదైనా సమస్య ఉంటే తనతో నేరుగా మాట్లాడవచ్చని, జట్టు ఎంపికపై అతను చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని చెప్పాడు. షమీ ఫిట్గా లేకపోవడంతోనే ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదని స్పష్టం చేశాడు. రంజీ క్రికెట్లో ఫిట్నెస్ నిరూపించుకుంటే జాతీయ జట్టులోకి తీసుకుంటామని తెలిపాడు.