బుడ్డోడు కాదు.. గేమ్ ఛేంజర్: అజిత్ అగార్కర్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ పిల్లోడు కాదని గేమ్ ఛేంజర్ అని కొనియాడాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన వైభవ్ సూర్యవంశీ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనతో పాటు ఆసియా గేమ్స్ ఆడే భారత టీ20 జట్టులో ఈ 15 ఏళ్ల కుర్రాడికి సెలెక్టర్లు అవకాశం కల్పించారు.
దాంతో టీమిండియాకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. శనివారం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని నయా టీ20 టీమ్ను సెలెక్టర్లు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీని అగార్కర్ ప్రత్యేకంగా కొనియాడాడు. వైభవ్ను భారత జట్టులోకి తీసుకునేలా తన ఆటతో తమపై ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు.
క్షణాల్లో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు..
'ఇంత చిన్న వయసులో వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరు అసాధారణం. ప్లేఆఫ్ మ్యాచ్ల్లోనూ దాదాపు ఒంటిచేత్తో రాజస్థాన్ రాయల్స్ను గెలిపించాడు. ఈ సీజన్లోనే కాదు.. గత సీజన్ నుంచే అతను తన ప్రతిభను కనబరుస్తున్నాడు. తీవ్రమైన పోటీ, ఒత్తిడితో కూడిన టీ20 క్రికెట్లో ఎలా బ్యాటింగ్ చేయగలడో చూపించాడు.

టీ20 క్రికెట్లో అతనిపై చాలా ఆశలున్నాయి. క్షణాల్లో మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యం అతని సొంతం. వైభవ్ పిల్లోడు కాదు.. గేమ్ ఛేంజర్. ఆ అసాధారణ ప్రతిభతోనే భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. విధ్వంసకర ఆటతీరుతో మా సెలెక్షన్ కమిటీపై ఒత్తిడి తెచ్చాడు.'అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు.
సూర్యపై వేటు..
పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసిన సెలెక్షన్ కమిటీ అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ను కొత్త సారథిగా ఎంపిక చేసింది. వైస్ కెప్టెన్గా తెలుగు తేజం తిలక్ వర్మను నియమించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో మొత్తం ఐదుగురు ఆటగాళ్లు ఉద్వాసనకు గురయ్యారు.
నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్లకు అవకాశం కల్పించారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వగా.. రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్పై వేటు పడింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.
జూన్ 26న బుడ్డోడి అరంగేట్రం..
అఫ్గానిస్థాన్తో సిరీస్ల అనంతరం టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్తో జూన్ 26న, జూన్ 28న రెండు టీ20లు జరగనుండగా.. ఇంగ్లండ్తో జులై 1న, జులై 4న, జులై 7న, జులై 9న, జులై 11న ఐదు టీ20లు జరగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఐర్లాండ్తో జూన్ 26న జరిగే తొలి టీ20తో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలి భారత క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ నిలవనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

