మిడిలార్డర్లో ఆడే వికెట్ కీపర్ను తీసుకోవాలనే ఉద్దేశంతోనే స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ను టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేయలేదని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. రాహుల్ కంటే సంజూ శాంసన్ తమకు బెస్ట్ ఆప్షన్ అనిపించిందని స్పష్టం చేశాడు. జూన్ 1 నుంచి 29 వరకు అగ్రరాజ్యం అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే ఆయా జట్లను క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.
15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం(ఏప్రిల్ 30) ప్రకటించింది. ఈ జట్టులో వికెట్ కీపర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్ అవకాశాలు దక్కించుకున్నారు. సీనియర్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. ఈ ప్రపంచకప్ ఎంపికకు సంబంధించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిథి కేఎల్ రాహుల్ను ఎంపికచేయకపోవడంపై ప్రశ్నించగా.. అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. 'ఐపీఎల్లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. మాకు మిడిలార్డర్లో ఆడే వికెట్ కీపర్ కావాలి. దాంతో సంజూ శాంసన్, రిషభ్ పంత్లను తీసుకున్నాం. మా ప్రణాళికలకు వారే సూట్ అవుతారు.
బ్యాటింగ్ లైనప్లో సంజూ శాంసన్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. బ్యాటర్ ఎవరా? అనేది చూడకుండా మాకు కావాల్సిన ఆప్షన్స్ను మాత్రమే తీసుకున్నాం.'అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 ప్రదర్శన ఆధారంగా భారత టీ20 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయలేదని కూడా అగార్కర్ స్పష్టం చేశాడు.
ఇక విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్కు సంబంధించి తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని, అతను అద్భుతంగా ఆడుతున్నాడని, అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అగార్కర్ అన్నాడు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.