టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఓపెనర్ కాదని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ గైర్హాజరీలో జట్టు అవసరాల కోసం మాత్రమే అతను ఓపెనర్గా ఆడాడని స్పష్టం చేశాడు. శుభ్మన్ గిల్ రీఎంట్రీతో సంజూ శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశాలు లేవని అగార్కర్ పరోక్షంగా చెప్పాడు. ఆసియా కప్ 2025 బరిలోకి దిగే భారత జట్టును అగార్కర్ ప్రకటించాడు. మంగళవారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించాడు.
అందరూ ఊహించనట్లుగానే భారీ మార్పులు లేకుండా జట్టును ఎంపిక చేశారు. జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, శివమ్ దూబే రీఎంట్రీ ఇవ్వగా.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్గా జితేష్ శర్మకు చోటు దక్కింది. అయితే ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్తో పాటు యశస్వి జైస్వాల్కు అవకాశం దక్కలేదు. టీమ్ కాంబినేషన్లో భాగంగానే ఈ ఇద్దరికి అవకాశం దక్కలేదని అగార్కర్ వివరణ ఇచ్చాడు. అవకాశాల కోసం ఈ ఇద్దరు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు.

మరోవైపు సంజూ శాంసన్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'టీ20 జట్టును ఎంపిక చేసేటప్పుడు ఐపీఎల్ ప్రదర్శనలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని టెస్ట్ సిరీస్ల కారణంగా.. టీ20ల్లో చాలా మంది ఆటగాళ్లు ఆడాల్సి వచ్చింది. దాంతో టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్ల టీ20 సామర్థ్యం తగ్గినట్లు కాదు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లు టీ20 ఫార్మాట్కు అందుబాటులో లేనప్పుడు సంజూ శాంసన్, అభిషేక్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
అభిషేక్ అద్భుతమైన ప్రదర్శన తనను పక్కన పెట్టలేని పరిస్థితిని తీసుకొచ్చాడు. అంతేకాకుండా అతని ద్వారా టీమిండియాకు అదనపు బౌలింగ్ ఆప్షన్ లభిస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత శ్రీలంక వేదికగా జరిగిన టీ20 సిరీస్లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు అతను అందుబాటులో ఉండటంతో జట్టులోకి తీసుకున్నాం. సెలెక్షన్ కమీటీగా 15 మందిని ఎంపిక చేయడం మా పని. బ్యాటింగ్ లైనప్ ఎంచుకోవడం టీమిండియా మేనేజ్మెంట్ తలనొప్పి. టీ20 క్రికెట్లో భారత్కు చాలా డెప్త్, ఆప్షన్స్ ఉన్నాయి.'అని చెప్పుకొచ్చాడు. అగార్కర్ కామెంట్స్ను బట్టి చూస్తే శుభ్మన్ గిల్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడనిపిస్తోంది. అదే జరిగితే సంజూ శాంసన్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.