
ముంబై: భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ జాతీయ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. శుక్రవారం(జనవరి 24వ) దరఖాస్తులకు చివరి తేదీ కాగా అగార్కర్ ఆఖరి క్షణంలో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ రేసులోకి వచ్చాడు. సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని అగార్కర్ ధృవీకరించాడు. ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్గా పనిచేసిన అగార్కర్ సెలెక్షన్ కమిటీలోకి వస్తే ఛైర్మన్ అయ్యే అవకాశం ఉంది.
భారత్ తరఫున 26 టెస్టులు,191 వన్డేలు, మూడు టీ20లు ఆడిన అగార్కర్... అన్ని ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు పడగొట్టాడు. వన్డేలో 288 వికెట్లతో ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు సాధించిన మూడో భారత బౌలర్గా కొనసాగుతున్నాడు. అగార్కర్ కన్నా ముందు అనిల్ కుంబ్లే(334), జవగల్ శ్రీనాథ్(315) ముందున్నారు. ఇక అతను ఆడుతున్న సమయంలో వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టాడు. 23 మ్యాచ్ల్లోనే ఈ ఘనతనందుకొని రికార్డు సృష్టించాడు. అనంతరం ఈ రికార్డును శ్రీలంక బౌలర్ మెండిస్(19 మ్యాచ్లు) అధిగమించాడు.
ప్రస్తుత సెలెక్షన్ కమిటీలో పదవీకాలం పూర్తి చేసుకున్న సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్ జోన్), సెలెక్టర్ గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) స్థానాలను బీసీసీఐ భర్తీ చేయనుండగా సందీప్ సింగ్ (నార్త్ జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్) మరో ఏడాది కొనసాగనున్న సంగతి తెలిసిందే.
'అజిత్ అగార్కర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ రేసులోకి రావడం ఆసక్తికరం. అతను చాలా ఆలోచించే దరఖాస్తు చేసుంటాడు. సెలెక్షన్ ఛైర్మన్గా శివరామకృష్ణనే అనుకునేవారంత అజిత్ ఎంట్రీతో పునరాలోచనలో పడ్డారు. ఇక ఎవరు షార్ట్ లిస్ట్ అవుతారో అనేది కూడా ఆసక్తికరంగా మారింది.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న ఆటగాళ్లు..
అజిత్ అగార్కర్(ముంబై), చేతన్ శర్మ(హరియాణా), నయాన్ మోంగియా(బరోడా), లక్ష్మణ్ శివరామకృష్ణన్(తమిళనాడు), రాజేశ్ చౌహాన్( మధ్యప్రదేశ్), అమే ఖురేషియా(మధ్యప్రదేశ్), గ్యానేంద్ర పాండే(యూపీ), ప్రీతమ్ గాందే(విదర్భ్)