న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అగర్కార్ సోమవారం వెల్లడించాడు. అంతా ఊహించినట్లుగానే గాయాలతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చారు.
శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మతో పాటు ప్రసిధ్ కృష్ణ చోటు దక్కించుకున్నాడు. చైనామన్ కుల్దీప్ యాదవ్కు అవకాశం కల్పించిన భారత సెలెక్టర్లు యుజ్వేంద్ర చాహల్పై వేటు వేసారు. అతనికి బదులు బ్యాటింగ్ చేయగల అక్షర్ పటేల్ను తీసుకున్నారు. జట్టు ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడిన అగార్కర్, రోహిత్ శర్మ.. అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు.

ఈ నేపథ్యంలోనే యుజ్వేంద్ర చాహల్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని అగార్కర్ వెల్లడించాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన అక్షర్ పటేల్ను ఎంపిక చేయడం కోసం ఓ రిస్ట్ స్పిన్నర్ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు. చాహల్ కంటే కుల్దీప్ యాదవ్ మెరుగ్గా రాణిస్తుండటంతో అతనికి అవకాశం దక్కిందని స్పష్టం చేశాడు.
'అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు బ్యాట్తో కూడా సత్తా చాటగలడు. కుల్దీప్ యాదవ్ కూడా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను ఎంచుకోవడం కష్టం. అందుకే కుల్దీప్ యాదవ్నే ఎంపిక చేశాం.'అని అగార్కర్ తెలిపాడు.
ఇక రోహిత్ శర్మ మాట్లాడుతూ.. యుజ్వేంద్ర చాహల్తో పాటు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్లకు ఇంకా టీమిండియా డోర్స్ తెరిచే ఉన్నాయని స్పష్టం చేశాడు. 'చాహల్ కోసం ఓ పేసర్ను పక్కన పెట్టలేని పరిస్థితి. ఆసియాకప్ 2023 జట్టులో 17 మందికి మాత్రమే చోటుంది. అందుకే యుజ్వేంద్ర చాహల్ను తీసుకోలేకపోయాం.
అతనితో పాటు రవి అశ్విన్, వాషింగ్టన్ సుందర్లకు ప్రపంచకప్ దారులు మూసుకుపోలేదు. పరిస్థితులకు తగ్గట్లు వారిని జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ పర్యటనలో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మూడు వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు చాహల్ మాత్రం అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయాడు.