టీమిండియా సెలెక్షన్ కమిటీ తీరుపై వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా.. ఏజ్ ఎక్కువని తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఫామ్ కాకుండా తన వయసును చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా చత్తీస్గఢ్తో జరిగిన రంజీ మ్యాచ్లో అజింక్యా రహానే 159 పరుగులతో సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన అజింక్యా రహానే.. సెలెక్టర్ల తీరును తప్పుబడుతు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన అవసరం కనిపించిందన్నాడు. ఈ సిరీస్లో తాను ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. 'వయసు కేవలం అంకె మాత్రమే. అనుభవం కలిగిన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తే జాతీయ జట్టుకు ఎంపిక చేయాలి. వయసు ఏ మాత్రం ముఖ్యం కాదు. ఆడాలన్న ఇంటెంట్ ముఖ్యం. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నా అవసరం కనిపించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ సెలెక్టర్లు నా వయసునే పరిగణలోకి తీసుకొని పక్కనపెట్టారు.

ఆస్ట్రేలియా ప్లేయర్ మైకేల్ హసీ 30 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవం చాలా ముఖ్యం. అందుకే ఆస్ట్రేలియాలో నా అవసరం ఉంటుందని భావించా. నాలాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు పునరాగమనం చేసినప్పుడు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. జట్టులో నుంచి తప్పించేటప్పుడు కూడా సెలెక్టర్లు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గత నాలుగైదేళ్లుగా దేశవాళీలో ఆడుతున్నా. నిలకడగా రాణిస్తున్నా. పరుగులు, ప్రదర్శనలను పక్కనపెడితే ఆటపై ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.'అని 37 ఏళ్ల రహానే చెప్పుకొచ్చాడు.
రహానే చివరిగా 2023 జూలైలో వెస్టిండీస్పై ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రహానేతో పాటు చతేశ్వర్ పుజారాను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు.