ముంబై: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్బుత యార్కర్తో ప్రత్యర్థిని క్లీన్ బౌల్డ్ చేస్తే.. మునపటిలా కోహ్లీ గాల్లో ఎగురుతూ అతన్ని వాటేసుకోవడం.. బౌండరీల దగ్గర ఉన్న ఆటగాళ్లు పరుగెత్తుకొచ్చి మీద పడి తలను నిమరడం ఇక కనబడకపోవచ్చు. ప్రపంచాన్ని అస్థవ్యస్థం చేసిన కరోనా పుణ్యమా..ఆటలో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. భౌతిక దూరాన్ని ఆటల్లో కూడా పాటించాల్సి రావచ్చు.
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా కరోనా తర్వాత ఆటలో సహజంగానే మార్పులు వస్తాయని, సహచరుల మధ్య కౌగిలింతలు, అభినందనలు కొంత కాలం కనిపించకపోవచ్చని తెలిపాడు. ఇక ఐసీసీ కూడా బంతి స్వింగ్ కోసం బౌలర్లు ఉపయోగించే ఉమ్మిని నిషేధించాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఆటలో మార్పులపై టీమిండియా టెస్ట్ కెప్టెన్ అజింక్యా రహానే స్పందిస్తూ.. మునపటిలా ఆటగాళ్లు సంబరాలు ఉండయన్నాడు.
ఇక నుంచి సింపుల్గా నమస్కారాలు మాత్రమే ఉంటాయని తెలిపాడు. క్రికెట్లోనే కాదని కరోనా కారణంగా జీవన విధానమే మారుతుందని చెప్పుకొచ్చాడు. 'వికెట్ తీసిన ఆనందాన్ని నమస్తే లేక ఇంకేదైన సాధారణ చర్యతోనే సరిపెట్టాలి. పాత రోజుల్లా ఎక్కడ నిలబడ్డావో అక్కడే ఉండాలి. బౌండరీల నుంచి పరుగుత్తుకు రావాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి ఓ నమస్తే చేస్తే సరిపోతుంది. ఇంతకన్నా ఏం చేయలేం. కేవలం క్రికెటే కాదు.. మన జీవన విధానమే మారనుంది'అని రహానే ఓ వెబ్ కాన్ఫరెన్స్లో చెప్పుకొచ్చాడు.
క్రికెట్ అంటేనే భావోద్వేగాలతో కూడుకున్నదని, కానీ కరోనా మహమ్మారి వల్ల వాటిని అదుపుచేసుకోక తప్పదని ఈ వైస్ కెప్టెన్ తెలిపాడు. 'క్రికెట్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కానీ క్రికెట్ లైఫ్ స్టైల్లో మాత్రం మార్పులు చోటుచేసుకుంటాయి. మైదానంలో ఆటనే పూర్తిగా మారుతుందనుకోకండి. లైఫ్ స్టైల్ ఒక్కటే మారుతుంది. ఐసీసీ ఏం చర్యలు తీసుకుంటుందో తెలియదు. ఆట కోసం.. వచ్చే మార్పుల కోసం ఎదురు చూడాల్సిందే.'అని రహానే తెలిపాడు. ఇక ఈ కరోనా లాక్డౌన్ పూర్తిగా కుటుంబ సభ్యులతో గడుపుతున్నానని, తన సతీమణికి వంటింటిలో సహాయం చేస్తున్నానని ఈ ముంబై క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ క్రికెటర్తో ఎఫైర్ అంటూ తమన్నాపై తప్పుడు ప్రచారం.!