
దుబాయ్: గతేడాది వన్డే ప్రపంచకప్లో జట్టులో నాలుగో నంబర్ తనదే అనుకున్నానని, కానీ, టోర్నీకి ఎంపికవ్వకపోవడంతో తీవ్రంగా బాధపడ్డానని టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే అన్నాడు. కెరీర్ ప్రారంభంలో అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్న రహానే ఇటీవల టెస్ట్లకే పరిమితమయ్యాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అంతగా రాణించకపోవడంతో అతన్ని పక్కన పెట్టేశారు.
గతేడాది వన్డే వరల్డ్కప్కు కూడా సెలెక్ట్ చేయలేదు. గత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును నడిపించిన రహానే.. ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్కు ట్రేడ్ ద్వారా బదిలీ అయ్యాడు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న రహానే ఈ సీజన్ ఐపీఎల్ కోసం సిద్దమవుతున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో సత్తా చాటి ఇండియా లిమిటెడ్ ఓవర్ల టీమ్లోకి తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
'ప్రపంచకప్లో నాలుగో స్థానం నాదే అనుకున్నా. కానీ, అది ముగిసిన అధ్యాయం. వన్డే టీమ్లోకి తిరిగి రావడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో
అందరూ నా స్ట్రయిక్ రేట్, యావరేజ్ తక్కువని మాట్లాడుతారు.కానీ వన్డే టీమ్ నుంచి నన్నుతప్పించే ముందు నా రికార్డు బాగానే ఉంది. సెలెక్టర్ల ఆలోచన ఎలా ఉన్నా నా మీద నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా భారత పరిమిత ఓవర్ల జట్టులోకి పునరాగమనం చేస్తా'అని రహానే విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నానన్నాడు. 'పాంటింగ్ సమక్షంలో ఆడాలని చాలా ఉత్సాహంగా ఉన్నా. ఒక ఆటగాడిగా నేనెప్పుడూ మరింత ఎదగాలని, ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటా . కరోనా కారణంగా రికీతో ఎక్కువ సమయం గడిపే పరిస్థితి లేదు. కానీ అతని దగ్గర నుంచి వీలైనంత నేర్చుకుంటా'అని అజింక్యా చెప్పుకొచ్చాడు.
మన్కడింగ్ విషయంలో రికీ పాంటింగ్, ఈ సారి ఢిల్లీకి ఆడుతున్న స్పిన్నర్ అశ్విన్ మధ్య తలెత్తిన భిన్నాభిప్రాయాలపై స్పందించేందుకు రహానే నిరాకరించాడు. 'ఈ విషయం గురించి ఇప్పుడు అశ్వినే మాట్లాడాలి. పాంటింగ్ ఇది వరకే సమాధానం చెప్పాడు కాబట్టి ఆ న్యూస్ అక్కడితో పూర్తయింది. దాన్ని అలానే ఉంచాలి. ఇప్పుడు మేం ఒకే టీమ్కు ఆడుతున్నాం కాబట్టి ఒకరికొకరం మద్దుతగా ఉండాలి'అని తెలిపాడు.