సమష్టి ప్రదర్శనతోనే ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024లో ఛాంపియన్గా నిలిచామని ముంబై టీమ్ సారథి, టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే తెలిపాడు. విదర్భతో వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై 169 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. రంజీ ట్రోఫీ చరిత్రలో 42వ సారి ఛాంపియన్గా నిలిచింది.
ఈ విజయానంతరం మాట్లాడిన అజింక్యా రహానే ప్రత్యర్థి విదర్భ జట్టును కొనియాడాడు. ఫైనల్లో ఓడినా.. విజయం కోసం ఆఖరి వరకు పోరాడిందని మెచ్చుకున్నాడు.

'మా ప్రదర్శన గురించి మాట్లాడే ముందు విదర్భ జట్టు పోరాట పటిమను కొనియాడాలి. ఆఖరి క్షణం వరకు ఆ జట్టు అద్భుతంగా పోరాడింది. ఓటమి తప్పదని తెలిసినా ఆ జట్టు వెనకడుగు వేయలేదు. గత 7-8 ఏళ్లుగా ఆ జట్టు నిలకడగా రాణిస్తోంది. ఈ విజయం మాకు చాలా ప్రత్యేకం. గతేడాది మేం పరుగు తేడాలో నాకౌట్కు అర్హత సాధించలేకపోయాం.
ఆ పరాజయం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. మా జట్టులో నైపుణ్యం కలిగి ఆటగాళ్లు ఉన్నారనే విషయం మాకు తెలుసు. కానీ జట్టులో సరైన కల్చర్తో పాటు వైఖరిని అలవర్చడం ముఖ్యం. జట్టును వెనకుండి నడిపించిన ముంబై క్రికెట్ అసోసియేషన్, సపోర్ట్ స్టాఫ్కు నా ధన్యవాదాలు. నా వ్యక్తిగత ప్రదర్శన గురించి నేనేం దిగులు పడటం లేదు.
ప్రతీ ఆటగాడికి కెరీర్లో ఒడిదొడుకులు ఉండటం సహజం. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయానికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఈ సీజన్లో మా జట్టు తరఫున నేను అత్యల్ప స్కోర్ చేశాను. కానీ మేం రంజీ ఛాంపియన్గా నిలిచాం. ధావల్ కులకర్ణితో కలిసి నేను అండర్ 14 నుంచి ఆడుతున్నాను. మేం ఇద్దరం కలిసి భారత అండర్ 19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాను. అతనో అద్భుతమైన ఆటగాడు.'అంటూ రహానే చెప్పుకొచ్చాడు.
538 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 248/5తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన విదర్భ నిలకడగా ఆడింది. కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (102; 199 బంతుల్లో), హర్ష్ దూబె (65; 128 బంతుల్లో) సాధికారికంగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. తొలి సెషన్లో ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. అయితే వారిద్దరి 130 పరుగుల భాగస్వామ్యం అనంతరం విదర్భ పతనం మొదలైంది. 15 పరుగులకే విదర్భ చివరి అయిదు వికెట్లు కోల్పోయింది.