
అడిలైడ్: పక్కటెముకల గాయంతో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ జట్టుకు దూరమైనప్పటికీ తమ బౌలింగ్ లైనప్ బలంగానే ఉందని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్లో బరిలోకి దిగే టీమ్ కాంబినేషన్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. గురువారం ప్రారంభమయ్యే డే అండ్ నైట్ మ్యాచ్తో నాలుగు టెస్ట్ల సిరీస్ షురూ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రహానే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'సీనియర్ పేసరైన ఇషాంత్ లేకపోవడం మాకు లోటే. అయినా మా బౌలింగ్ విభాగం బలంగానే ఉంది. బుమ్రా, షమీ, సైనీ, సిరాజ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. వాళ్లందరికీ ఆసీస్లోని పిచ్ పరిస్థితులపై అవగాహన ఉంది. ఇక్కడ వికెట్లపై ఎలా బౌలింగ్ చేయాలో వారికి తెలుసు. మా బౌలింగ్ అటాక్కు 20 వికెట్లు తీసే సత్తా ఉందని నా నమ్మకం. ఇక ఫస్ట్ టెస్ట్కు సంబంధించి జట్టు కాంబినేషన్స్పై మేమింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మాకు మరో ప్రాక్టీస్ సెషన్ ఉంది. అందువల్ల బుధవారం సమావేశమై కాంబినేషన్లపై ఓ నిర్ణయం తీసుకుంటాం. అయితే టీమ్లో అందరూ సమానమే. ఎవరికి అవకాశం దొరికితే వాళ్లే మమ్మల్ని గెలిపిస్తారు. సీనియర్ ప్లేయరైన అశ్విన్ ఇటు బౌలర్గా, అటు బ్యాట్స్మన్గా జట్టుకు చాలా కీలకం'అని రహానే చెప్పుకొచ్చాడు. డే అండ్ నైట్ టెస్ట్ల్లో సూర్యాస్తమయ సమయం మ్యాచ్లో చాలా కీలకమని రహానే అభిప్రాయపడ్డాడు. 40-50 నిమిషాలు ఉండే ఆ టైమ్లో వికెట్ వేగం పెరుగుతుందని, ఆ సమయంలో బాల్ను ఎదుర్కోవడం ఎవ్వరికైనా సవాలేనన్నాడు.