సమష్టి బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో సోమవారం జరిగిన ఏకపక్ష మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రహానే.. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై సమష్టిగా విఫలమయ్యామని చెప్పాడు. స్కోర్ బోర్డుపై తగిన పరుగులు లేకపోవడంతో బౌలర్లు ఏం చేయలేకపోయారని తెలిపాడు.
'ఇది సమష్టి బ్యాటింగ్ వైఫల్యం. టాస్ సమయంలో నేను చెప్పినట్లు బ్యాటింగ్ చేసేందుకు ఇది అనుకూలమైన వికెట్. ఈ వికెట్పై 180-190 పరుగుల చేస్తే సరిపోతుంది. మంచి బౌన్స్ ఉంది. కొన్నిసార్లు పేస్తో బౌన్స్ను ఉపయోగించాలి. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ నుంచి మేం గుణపాఠం నేర్చుకోవాలి. బంతితో మేం ఏం చేయలేకపోయాం.

మా బౌలర్లు వారి శక్తి మేర ప్రయత్నించారు. కానీ స్కోర్ బోర్డుపై తగినన్ని పరుగులు లేవు. మేం వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం మాకు నష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయాలంటే.. భాగస్వామ్యాలు నమోదు చేయాలి. ఒక బ్యాటర్ చివరి వరకు క్రీజులో ఉండాలి.'అని రహానే చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. అంగ్క్రిష్ రఘువంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26), రమణ్దీప్ సింగ్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్(4/24) నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విజ్ఞేష్ పుతుర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 12.5 ఓవర్లలోనే 2 వికెట్లకు 121 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(12), విల్ జాక్స్(16) విఫలమైనా.. ర్యాన్ రికెల్టన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 62 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్(2/235)కు రెండు వికెట్లు దక్కాయి. ఈ భారీ విజయం ముంబై ఇండియన్స్ నెట్ రన్రేట్ను కూడా మెరుగుపర్చింది.