న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జట్టుపై గౌరవంతోనే కంగారూ షేప్లో ఉన్న కేక్ను కట్ చేయలేదని అజింక్యా రహానే చెప్పాడు. ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రాత్మక సిరీస్ విజయంలో చివరి మూడు మ్యాచ్లకు కెప్టెన్గా ఉన్న రహానేకు ముంబైలోని తన కాలనీలో ఘన స్వాగతం లభించింది. సెలెబ్రేషన్స్లో భాగంగా కంగారూ బొమ్మ ఉన్న కేక్ను కట్ చేయాలని అభిమానులు కోరగా అందుకు అజింక్యా రహానే నిరాకరించాడు.
ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. రహానేపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రహానే దీని గురించి మాట్లాడాడు. 'కంగారూ వాళ్ల(ఆస్ట్రేలియా) జాతీయ జంతువు. కాబట్టి నేను ఆ పని చేయదలుచుకోలేదు. ప్రత్యర్థిని మనం గౌరవించాలి. మనం గెలిచినా.. చరిత్ర సృష్టించినా సరే ప్రత్యర్థులకు ఇతర దేశాలకు గౌరవం ఇవ్వాలి. అందుకే నేను ఆ కేక్ కట్ చేయొద్దనుకున్నా'అని రహానే చెప్పుకొచ్చాడు.
ఇక పెటర్నిటీ లీవ్పై ఫస్ట్ టెస్ట్ అనంరతం ఆస్ట్రేలియా పర్యటన నుంచి విరాట్ కోహ్లీ అర్థాంతరంగా తప్పుకోగా.. మిగిలిన మూడు టెస్ట్ల్లో భారత జట్టును రహానే నడిపించిన విషయం తెలిసిందే. 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయంతో పరువు తీసుకున్న జట్టును రహానే సూపర్ కెప్టెన్సీతో విజేతగా నిలిపాడు. మెల్బోర్న్లో సెంచరీతో మెరిసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత తనదైన వ్యూహాలతో సిడ్నీ టెస్ట్ను డ్రా చేసుకోని.. ఆసీస్ కంచుకోట అయిన గబ్బాలో చారిత్రాత్మక విజయంతో సిరీస్ను కైవసం చేసుకున్నాడు.
ఇక ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్తో తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే చెన్నైకు చేరుకొని ఆరు రోజుల క్వారంటైన్లో ఉన్నారు.