ఐపీఎల్ 2025 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అజింక్యా రహానే.. ఇది చాలా టైట్ గేమ్ అని, విజయం కోసం ఆఖరి వరకు పోరాడమని తెలిపాడు.
'ఇది చాలా టైట్ గేమ్. టాస్ సందర్భంగా నేను చెప్పినట్లే 40 ఓవర్ల పాటు పిచ్ ఒకేలా ఉంది. విజయం కోసం మేం సాయశక్తులా ప్రయత్నించాం. ఇదో గొప్ప మ్యాచ్. కేవలం 4 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాం. 230 ప్లస్ రన్స్ చేజ్ చేస్తున్నప్పుడు వికెట్లు కోల్పోవడం అత్యం సహజం.'అని రహానే తెలిపాడు.

అయితే తమ ప్రధాన స్పిన్నర్లు అయిన సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ కట్టడిగా బౌలింగ్ చేయకపోవడమే తమ విజయవకాశాలను దెబ్బతీసిందని రహానే అభిప్రాయపడ్డాడు. 'బ్యాటింగ్కు ఇది అత్యుత్తమైన వికెట్. అయితే మేం ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాం. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రించాం. సునీల్ నరైన్ బంతితో కాస్త ఇబ్బంది పడ్డాడు. సాధారణంగా సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ మిడిల్ ఓవర్లలో ఆధిపత్యం చెలాయిస్తారు. కానీ బౌలర్లకు ఇది కఠినమైన పిచ్.'అని రహానే చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 81), నికోలస్ పూరన్(36 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్లతో 87 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా(2/51) రెండు వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్ ఓ వికెట్ పడగొట్టాడు. లక్నో ఇన్నింగ్స్లో మొత్తం 15 సిక్సర్లు నమోదవ్వగా.. మార్ష్, పూరన్లే 13 సిక్స్లు కొట్టారు.
అనంతరం కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులే చేసి ఓటమిపాలైంది. అజింక్యా రహానే(35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ దీప్(2/55), శార్దూల్ ఠాకూర్(2/47) రెండేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ రతి, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.