టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం ఎదురైందని వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే అన్నాడు. జట్టులో తరుచూ మార్పులు చేయడం టీమిండియా ఓటమిని శాసించిందని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను 2-1తో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా.. తర్వాతి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. 38 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ తొలి వన్డే సిరీస్ గెలిచింది. ఈ పరాజయం నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు మేనేజ్మెంట్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఈ పరాజయంపై మాట్లాడిన రహానే.. టీమిండియా ఓటములపై బరాబర్ ప్రశ్నలు వస్తాయని తెలిపాడు. 'జట్టు ప్రదర్శనపై కచ్చితంగా కఠినమైన ప్రశ్నలు ఎదురవుతాయి. భారత్ గత 9 వన్డేల్లో ఐదు ఓడిపోయింది. అందుకు కారణం.. జట్టులో అతిగా మార్పులు చేయడం. అందుకే మేనేజ్మెంట్ నుంచి ఆటగాళ్లకు తమ స్థానాలపై భరోసా కావాలని చెబతున్నా. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు సిద్దమవుతున్నప్పుడు మేనేజ్మెంట్ నుంచి ఆటగాళ్లకు భద్రతతో పాటు స్పష్టత అవసరం. ఒక నిర్దిష్ట ఫార్మాట్లో కొందరు ఆటగాళ్లను ఆడించాలనుకున్నప్పుడు.. ఆ విషయంలో వారికి స్పష్టత ఉండాలి.
ఓటములు ఎదురైనప్పుడు ప్రశ్నలు వస్తాయి. అది చాలా సహజం. ఎందుకంటే అభిమానులు భారత క్రికెట్తో అంతగా ముడిపడి ఉంటారు. భారత బాగా ఆడాలని, మ్యాచ్ గెలవాలని, సిరీస్ గెలవాలని కోరుకుంటారు. ముఖ్యంగా భారత్లో ఆడుతున్నప్పుడు ఓటమిని ఏ మాత్రం సహించరు. న్యూజిలాండ్ది ఏ టీమ్? బీ టీమ్ కావచ్చు. కానీ భారత్ సునాయసంగా 3-0తో ఈ సిరీస్ గెలుస్తుందని అంతా భావించాం. భారత జట్టుపై అంతలా అంచనాలు ఉన్నాయి.
కానీ న్యూజిలాండ్ ఆడిన తీరు అద్భుతం. భారత్ కేవలం ప్రక్రియను నమ్ముకోవాలి. మరో ఆరు నెలల వరకు భారత్కు వన్డే సిరీస్ లేదు. జట్టును తిరిగి సిద్దం చేసుకోవడానికి మేనేజ్మెంట్ ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. టీ20 ప్రపంచకప్ తర్వాత కూడా ఖాళీ సమయం లభించనుంది. సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంతో పాటు కాంబినేషన్ను కనుగోవడం, ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం కీలకం.'అని రహానే చెప్పుకొచ్చాడు.