బెంబేలెత్తించిన బుమ్రా:
భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ను బుమ్రా బెంబేలెత్తించాడు. బుమ్రా దెబ్బకు ఓపెనర్లు బ్రాత్వైట్ (1), క్యాంప్బెల్ (7) పది పరుగులకే పెవిలియన్కు చేరారు. బ్రూక్స్ (2)ను ఇషాంత్ అవుట్ చేయడంతో విండీస్ 10/3తో నిలిచింది. హెట్మయర్ (1)ను ఇషాంత్ ఔట్ అవుట్ చేయగా.. డారెన్ బ్రావో (2)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దీంతో టీ విరామానికి 5 వికెట్లు కోల్పోయి విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
చివరి వికెట్కు 50 పరుగులు:
అనంతరం హోప్ (2), హోల్డర్ (8)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఛేజ్ (12), గాబ్రియెల్ (0)ను షమీ వెనక్కుపంపాడు. చివర్లో రోచ్ (38) కొంతసేపు ప్రతిఘటించాడు. రోచ్, కమిన్స్ చివరి వికెట్కు 50 పరుగులు జోడించారు. టాపార్డర్ బ్యాట్స్మెన్ అత్యంత చెత్తప్రదర్శనతో నిరాశపరిచారు. ఏ ఒక్కరు కూడా కనీసం 20 బంతులాడలేకపోయారు. విండీస్ రెండో ఇన్నింగ్స్లో ముగ్గురు ఆటగాళ్లు ఛేజ్(12), రోచ్ (38), కమిన్స్ (19 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఈ మ్యాచ్లో బుమ్రా ప్రదర్శనే హైలెట్. 8 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 7 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు ఓవర్లు మెయిడిన్ కావడం విశేషం.
రహానే సెంచరీ:
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 185/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 7 వికెట్లకు 343 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నాలుగో రోజు ఆటలో రెండో ఓవర్లోనే చేజ్ బౌలింగ్లో కోహ్లీ (51) పెవియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి రహానే ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ జోడి విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. దీంతో లంచ్ సమయానికి 287/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. విరామం తర్వాత సెంచరీ పూర్తి చేసిన రహానే.. గాబ్రియెల్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. పంత్ (7), విహారి ఔటయ్యాక కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఛేజ్ (4/132) నాలుగు వికెట్లు తీసాడు.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్: సింధు తల్లి
రహానేకు అవార్డు:
తొలి టెస్టులో భారత్ 318 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. పరుగుల పరంగా విండీస్ జట్టుపై భారత్కిదే అత్యుత్తమ విజయం. 1988 జనవరిలో చెన్నైలో జరిగిన టెస్టులో విండీస్పై 255 పరుగుల తేడాతో గెలిచిన రికార్డును భారత్ సవరించింది. ఇక భారత టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో అతిపెద్ద విజయం కావడం విశేషం. రెండు ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడిన రహానే (81, 102) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. రెండు టెస్టుల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు శుక్రవారం కింగ్స్టన్లో జరగనుంది.