
టర్నింగ్ పాయింట్ అదే:
మ్యాచ్ సమయంలో సింధు తల్లి విజయ, ఇతర కుటుంబ సభ్యులు టీవీలో మ్యాచ్ను వీక్షించారు. సింధు విజయం సాధించిన అనంతరం అందరూ మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ... 'సింధు స్వర్ణం గెలవడం చాలా సంతోషంగా ఉంది. సింధు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చైనీస్ తైపీ క్రీడాకారిణిపై గెలవడం టర్నింగ్ పాయింట్. ఆ మ్యాచ్ తొలి సెట్లో సింధు రాణించలేదు. అయినా మిగతా రెండు సెట్లలో పుంజుకుని మ్యాచ్ గెలిచిన తీరు అద్భుతం. ఇక ఫైనల్లో మాత్రం ఒత్తిడి లేకుండా ఆడింది' అని ఆమె తెలిపారు.

చాలా పెద్ద బహుమతి:
'ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం సింధు గత ఆరు నెలలుగా తీవ్రంగా సాధన చేసింది. చివరకు ఫలితం దక్కింది. సింధుతో పాటు అందరం ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ఎదురుచూసాం. ప్రతిసారీ నా పుట్టిన రోజున సింధు ఏదో ఒక బహుమతి ఇచ్చేది. ఈ సారి నాకు, ఈ దేశానికి చాలా పెద్ద బహుమతి ఇచ్చింది. సింధు విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

చాలా గర్వంగా ఉంది
'తన కుమార్తె సాధించిన చారిత్రక విజయం తమకు గర్వకారణం. సింధు ఫైనల్స్లోనూ గెలవగలదని నిరూపించింది. ప్రపంచ చాంపియన్ స్వర్ణం సాధించడం గొప్పగా అనిపిస్తోంది. ఈ క్షణంలో తనతో పాటు ఉండటం చాలా గర్వంగా ఉంది. సింధు టోర్నీ కోసం చాలా కష్టపడింది. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది' అని సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు.
స్వర్ణ పతక విజేత పీవీ సింధుకు బాయ్ నజరానా

ఎక్కడా తడబడలేదు:
ఈ టోర్నీలో సింధు వరుసగా టాప్ క్రీడాకారిణులు తై జు యింగ్, చెన్ యుఫెయ్, ఒకుహరలను ఓడించడం గొప్ప విషయం. ఫైనల్ అయినా ఎక్కడా తడబడకుండా విజయం సాధించింది. సెమీస్లో వరుస సెట్లలో మ్యాచ్ను ముగించడం సింధుకు కలిసొచ్చింది. ప్రతి పెద్ద టోర్నీలో సింధు పతకాలు సాధించి అత్యుత్తమ క్రీడాకారిణగా నిలిచింది' అని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.


Click it and Unblock the Notifications












