
సిడ్నీ: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (228 బంతుల్లో 16 ఫోర్లు 1 సిక్స్తో 108 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగాడు. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో డ్రమ్మైన్ ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్లో రహానే కెప్టెన్సీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్లకు 237 పరుగులు చేసింది. రహానేకు తోడుగా టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా(140 బంతుల్లో 5 ఫోర్లు 54) రాణించాడు.
ఈ ఇద్దరూ మినహా అంతా విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో జేమ్స్ ప్యాటిన్సన్ మూడు వికెట్లు తీయగా.. నెసర్, ట్రావిస్ హెడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జాక్సన్ బర్డ్కు ఓ వికెట్ దక్కింది. క్రీజులో రహానే, మహ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) ఉన్నారు.
ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ ముందు రహానే, పుజారా ఫామ్ అందుకోవడం భారత్కు కలిసొచ్చే అంశం. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన ఈ ఇద్దరికి మంచి ప్రాక్టీస్ లభించింది. ఐపీఎల్లో అవకాశం వచ్చినప్పటికీ రహానే నిరాశపరిచిన విషయం తెలిసిందే.
ఈ వామప్ మ్యాచ్లో టాస్ గెలిచిన రహానే సేన.. తొలుత బ్యాటింగ్ చేపట్టింది. అయితే భారత ఓపెనర్లు పృథ్వీషా(0), శుభ్మన్ గిల్(0) ఖాతా తెరవకుండా వెనుదిరగడంతో గట్టిషాక్ తగిలింది. నెసర్ బౌలింగ్లో శుభ్మన్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరగ్గా.. పృథ్వీ షా కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హనుమ విహారీ(15) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. బర్డ్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో భారత్ 40 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ క్లిష్టస్థితిలో బ్యాటింగ్కు వచ్చిన పుజారాతో రహానే ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ జోడీ ఓపికగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచింది. అయితే క్రీజులో కుదురుకున్న ఈ ద్వయాన్ని ప్యాటిన్సన్ విడదీశాడు. హాఫ్ సెంచరీతో జోరుమీదున్న పుజారాను(54) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ వికెట్ల పతనం మొదలైంది సాహా(0) , అశ్విన్(5), కుల్దీప్ యాదవ్(15), ఉమేశ్ యాదవ్(24) వికెట్లను కోల్పోయింది. ఇందులో కుల్దీప్ ఒక్కడే 78 బంతులు ఆడి రహానేకు అండగా నిలవడంతో అతను శతకం పూర్తి చేసుకున్నాడు.