
దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ముందుకొచ్చాడు. తన వంతు సాయంగా రూ. 10 లక్షల రూపాయాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని రహానే సన్నిహితుడొకరు పీటీఐ వార్త సంస్థకు తెలియజేశారు. అయితే రహానే మాత్రం ఇప్పటి వరకు తాను చేసిన సాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇప్పటికే కొవిడ్-19పై పోరాటానికి బీసీసీఐ రూ.51 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు తెలిపింది. క్రికెటర్లలో సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించగా.. మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఎంపీల్యాడ్ నుంచి రూ. 1 కోటి పీఎం- కేర్స్ ఫండ్కి విరాళంగా అందజేశాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని వెస్ట్ బెంగాల్లోని పేదలకి అందజేస్తున్నాడు. పఠాన్ బ్రదర్స్ మాస్క్ల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. శిఖర్ ధావన్ కూడా పీఎం సహాయనిధికి తన సాయం చేశాడు. ఇతరులు కూడా చేయాలని కోరాడు.
ఇక బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల సాయాన్ని అందజేసింది. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభాగ్యులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటి వరకూ ఎలాంటి విరాళలు ప్రకటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ ఫండ్ రైజింగ్ సంస్థకు ధోనీ రూ. లక్ష విరాళం ప్రకటించినా.. దానిపై దుమారం రేగింది.
భారత్లో కరోనా బాధితుల సంఖ్య 1000కి సమీపించింది. ఆదివారం మధ్యాహ్నానికే 979కి చేరుకుంది. మొత్తం 25 మంది చనిపోయారు. ఇక దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో 186 మంది ఈ వైరస్ బారిన పడగా.. ఆరుగురు చనిపోయారు.
ఇక నేడు(మార్చి 29) ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదా పడగా.. దేశంలో కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. గత కొన్ని సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న రహానె ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్కి మారిన విషయం తెలిసిందే.