బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా విఫలమైన కేకేఆర్ 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్కు ఇది అతిపెద్ద పరాజయం కాగా.. సన్రైజర్స్కు రెండో అతిపెద్ద విక్టరీ. అంతేకాకుండా కేకేఆర్పై వరుసగా 5 ఓటముల తర్వాత ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన అజింక్యా రహానే.. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లను అభినందించాడు. వారి అసాధారణ బ్యాటింగ్తోనే తమకు ఓటమి తప్పలేదన్నాడు. తమకు వచ్చిన అవకాశాలను సద్దినియోగం చేసుకుంటే పాయింట్స్ టేబుల్లో 3-4 స్థానంలో నిలిచేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్ తమకు ఓ గుణపాఠమని చెప్పిన రహానే.. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

చెప్పినట్లు బౌలింగ్ చేయలేదు..
'సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మేం బౌలింగ్లో కొన్ని తప్పులు చేశాం. కానీ సన్రైజర్స్ బ్యాటర్లు బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అమోఘం. వాళ్లు లూజ్ బాల్స్, మంచి బాల్స్ అనే తేడా లేకుండా బౌండరీలు బాదారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. వారి ఇంటెంట్ బాగా ఉంది. సన్రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేయడానికి మేం స్లో బాల్స్, వైడ్ యార్కర్స్, మైడ్ స్లో బాల్స్ వేయడం గురించి చర్చించాం. కానీ మా బౌలర్లు మా ప్లాన్ను అమలు చేయలేకపోయారు. దాంతో క్లాసెన్ వంటి సన్రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మేం మా ప్రణాళికలను సమర్దవంతంగా అమలు చేయలేకపోయాం. బౌలింగ్ యూనిట్గా చాలా తప్పులు చేశాం.
టాప్-2లో నిలిచేవాళ్లం..
ఈ సీజన్లో మా ఆట నిరాశపర్చినా.. మాకు కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి. 2-3 మ్యాచ్లను చాలా దగ్గరగా కోల్పోయాం. జట్టు విజయం కోసం మా వంతు 100 శాతం ప్రయత్నించాం. మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. టీ20 ఫార్మాట్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఫార్మాట్ చాలా కఠినమైనది. ఐపీఎల్ ఇంకా కఠినమైదని. ఒక జట్టుగా మాకు అవకాశాలు లభించాయి. కానీ సద్వినియోగం చేసుకోలేకపోయాం. బహుషా మేం అవకాశాలు అందిపుచ్చుకొని ఉంటే పాయింట్స్ టేబుల్లో టాప్-2లో నిలిచేవాళ్లం. కానీ బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సీజన్ మాకు ఓ గుణపాఠం. ఆటగాళ్లంతా తమ వంతు ప్రయత్నించారు. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తాం.'అని రహానే చెప్పుకొచ్చాడు.