
లీడ్స్: ఇంగ్లండ్తో మూడో టెస్ట్కు ముందు భారత అభిమానులకు శుభవార్త. తొడ కండరాల గాయంతో లార్డ్స్ టెస్ట్కు దూరమైన స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్ పూర్తిగా కోలుకున్నాడు. బుధవారం నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్కు బ్యాటింగ్ సామర్థ్యం గల శార్దూల్ అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే వెల్లడించాడు.
మూడో టెస్ట్ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన రహానే.. శార్దూల్ గాయం నుంచి కోలుకున్నాడని, మూడో టెస్ట్ సెలెక్షన్కు అందుబాటులో ఉంటాడని తెలిపాడు. భారత తుది జట్టుకు సంబంధించి రహానే ఎలాంటి విషయాలు పంచుకోలేదు. 'శార్దూల్ ఠాకూర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. టీమ్ కాంబినేషన్స్ ఆధారంగా అతను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది'అని రహానే చెప్పుకొచ్చాడు.
ఇక పేలవ బ్యాటింగ్ నేపథ్యంలో చతేశ్వర్ పుజారాతో సహా తనపై వచ్చిన విమర్శలపై రహానే స్పందించాడు. తమ గురించి మాట్లాడిన మాటలను పట్టించుకోలేదని, సీనియర్ ఆటగాళ్లుగా ఒత్తిడి ఎలా అధిగమించాలో తమకు తెలుసని, లార్డ్స్ టెస్ట్లో అదే చేసి చూపించామన్నాడు. 'చతేశ్వర్ పుజారా, నా గురించి వచ్చిన విమర్శల పట్ల నేను సంతోషంగానే ఉన్నా. మా గురించి మాట్లాడిన మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఒత్తిడి ఎలా అధిగమించాలో మాకు తెలుసు. మేం అదే చేశాం. మా చేతుల్లో లేని వాటి గురించి మేం పట్టించుకోం'అని రహానే చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ వాతావరణం, పిచ్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తే జట్టు బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. పైగా అతను స్వింగ్ బౌలర్. ఈ కారణంగానే శార్దూల్ ఠాకూర్కు తొలి టెస్ట్లో అవకాశం దక్కింది. బ్యాటింగ్లో రాణించకపోయినా.. బౌలింగ్లో మాత్రం కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక లార్డ్స్ టెస్ట్కు ముందు అతని తొడ కండరాలు పట్టేయడంతో ఇషాంత్ శర్మకు అవకాశం దక్కింది.
ఇషాంత్ సైతం బౌలింగ్లో పర్వాలేదనిపించాడు. కానీ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేకపోయాడు. ఈ కారణాలతోనే లీడ్స్ టెస్ట్లో కూడా శార్దూల్ ఆడటం ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే లీడ్స్ వాతావరణ భిన్నంగా ఉందని, ఎండలు కాచి, వికెట్పై టర్న్ లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగవచ్చు. అప్పుడు శార్దూల్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది.