
ముంబై: న్యూజిలాండ్ స్పిన్ సెన్సేషన్ ఆజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన 10 వికెట్ల ఘనతను అందుకున్నాడు. భారత్తో ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో పదికి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకొని అరుదైన మైలు రాయిని తన పేరిట లిఖించుకున్నాడు. తద్వారా క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు ఈ ఘనతను భారత దిగ్గజం అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్ లెజెండ్ జిమ్ లేకర్ అందుకున్నారు. 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్లో 53 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్గా నిలిచాడు. ఆ తర్వాత మరో 43 ఏళ్లకు అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్పై ఒకే ఇన్నింగ్స్లో 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.
కుంబ్లే తర్వాత మళ్లీ 22 ఏళ్లకు ఆజాజ్ పటేల్ ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే భారత్ గడ్డపై ఓ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్గా ఆజాజ్ పటేల్ గుర్తింపు పొందాడు. కాగా తన కేరిర్లో ఇది మూడో 5 ఐదు వికెట్ల ఘనత కాగా... ఈ మూడు 5 వికెట్ల హాల్ కూడా ఆసియాలోనే సాధించడం గమనార్హం. అంతకు ముందు 2012లో హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ 4 వికెట్లు సాధించాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. ఆజాజ్ పటేల్ దాన్ని అధిగమించాడు.
ఇక ఆజాజ్ పటేల్ భారత సంతతికి చెందినవాడనే విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వారి కుటుంబం చాలా ఏళ్ల క్రితమే కివీస్కు వలస వెళ్లింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్లోనూ ఆజాజ్ పటేల్ చివరి వికెట్గా వచ్చి భారత విజయాన్ని అడ్డుకున్నాడు. ఇక ఆజాజ్ పటేల్ ధాటికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 109.5 ఓవర్లలో 325 పరుగులకు కుప్పకూలింది. ఉమేశ్ యాదవ్(0 నాటౌట్) అజేయంగా నిలిచాడు.