రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. లక్ కలిసి రావడంతో వైభవ్ సూర్య వంశీ సెంచరీ చేశాడని మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ అన్నాడు. ఈ కామెంట్స్పై భారత మాజీ క్రికెటర్ అజేయ జడేజాతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల వయసులో సెంచరీ చేయడం అంటే మాములు విషయం కాదని, కేవలం అదృష్టంతో ఇలాంటి ఇన్నింగ్స్లు ఆడలేరని శుభ్మన్ గిల్ పేరు ప్రస్తావించకుండా జడేజా చురకలంటించాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ సాధించి టీ20ల్లో అత్యంత పిన్న వయస్కుడిగా వరల్డ్ రికార్డ్ సాధించాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్మన్ గిల్.. పవర్ ప్లేలోనే సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ తమ విజయాన్ని లాగేసుకున్నారని చెప్పాడు. సూర్యవంశీ బ్యాటింగ్ గురించి హోస్ట్ ప్రశ్నించగా.. 'ఈ రోజు వైభవ్ సూర్యవంశీది. అతని హిట్టింగ్ అద్భుతం. తనకు కలిసొచ్చిన రోజును అతను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.'అని గిల్ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ వ్యాఖ్యలను అజయ్ జడేజా తప్పుబట్టాడు. 14 ఏళ్ల వయసులో కేవలం అదృష్టంతో అలాంటి ఇన్నింగ్స్ ఆడలేరని, దాని వెనుక ఎంతో కృషి, ప్రతిభ ఉందని గిల్ పేరు ప్రస్తావించకుండా జడేజా చురకలు అంటించాడు.
'14 ఏళ్ల వయసులో ఇలా ఆడటం, సెంచరీ చేయడం మామలు విషయం కాదు. కేవలం అదృష్టంతోనే ఇలా ఆడలేరు. ఈ ఇన్నింగ్స్ వెనుక ఆ కుర్రాడి ప్రతిభ, కృషి ఉంది. అతను ఆడిన తీరు అద్భుతం. అతని మానసిక ధ్రుఢత్వం అమోఘం. ఓ కుర్రాడి అద్భుతమైన ప్రదర్శన కేవలం అదృష్టంగా చూడటం సరికాదు.'అని జడేజా అభిప్రాయపడ్డాడు. ఫ్యాన్స్ సైతం గిల్పై విమర్శలు గుప్పిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసతో శుభ్మన్ గిల్కు తుది జట్టులో చోటు పోతుందేమోననే భయం పట్టుకుందని, దాంతోనే అతని ఆటను తక్కువ చేసేలా మాట్లాడాడని విమర్శలు గుప్పిస్తున్నారు.