న్యూఢిల్లీ: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో మార్క్రమ్ మామ 49 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు.
తద్వారా ఐర్లాండ్ ప్లేయర్ కెవిన్ ఓ బ్రెయిన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో కెవిన్ 50 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఇదే ఫాస్టెస్ట్ సెంచరీగా ఉండగా.. తాజాగా మార్క్రమ్ అధిగమించాడు. ఈ జాబితాలో గ్లేన్ మ్యాక్స్వెల్(51 బంతులు), ఏబీ డియవిలియర్స్(52 బంతులు), ఇయాన్ మోర్గాన్(57 బంతులు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

మార్క్రమ్ రికార్డు సెంచరీపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో మార్క్రమ్ సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో ఎయిడెన్ మార్క్రమ్(54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 106)తో పాటు ఓపెనర్ క్వింటన్ డికాక్(84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 100), రాసీ వాన్ డెర్ డస్సెన్(110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 108) సెంచరీలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగుల భారీ స్కోర్ చేసింది.
వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా(413) రికార్డును బ్రేక్ చేసింది. ప్రపంచకప్లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జాబితాలో సౌతాఫ్రికా(428), ఆస్ట్రేలియా (413) తర్వాత భారత్(411), సౌతాఫ్రికా(411), సౌతాఫ్రికా(408)లున్నాయి.
వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే సౌతాఫ్రికాకు ఇది మూడో 400 ప్లస్ స్కోర్ అయితే వన్డే క్రికెట్ చరిత్రలో 8వ సారి కావడం విశేషం. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీ చేయడం ఇది మూడోసారి. ఈ మూడు సార్లు కూడా సౌతాఫ్రికా బ్యాటర్లే ఈ ఫీట్ సాధించడం గమనార్హం.