IND vs SA: పేలవ బ్యాటింగ్కు తోడు పిచ్ కండిషన్స్ మారడం తమ ఓటమిని శాసించిందని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అన్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా టీమిండియాతో గురువారం జరిగిన చివరి టీ20లో 106 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మార్క్రమ్.. గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా చేజార్చుకున్నామని తెలిపాడు.
'200 పరుగుల లక్ష్యాన్ని చేధించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. మేం సునాయసంగా ఈ లక్ష్యాన్ని చేధిస్తామని భావించాను. కానీ పిచ్ పూర్తిగా మారిపోయింది. మేం ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ఈజీగా పరుగులు చేయవచ్చనిపించింది. కానీ మా బ్యాటింగ్ సమయంలో చాలా నెమ్మదించింది. ఏది ఏమైనా మేం కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఈ మ్యాచ్లో ఓడినా మాకు కొన్ని సానుకూలతలు లభించాయి.'అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీయగా.. నాండ్రె బర్గర్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. కుల్దీప్ యాదవ్(5/17) ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్(35), ఎయిడెన్ మార్క్రమ్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్కు తోడుగా రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.
భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా.. సూర్యకుమార్ యాదవ్ చేసిన 100 పరుగులు కూడా చేధించలేకపోయింది. సెంచరీతో కదం తొక్కిన సూర్యకుమార్ యాదవ్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.