హైదరాబాద్: ఒత్తిడిని అధిగమించకపోవడమే తమ ఓటమిని శాసించిందని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పేలవ బౌలింగ్తో 180 పరుగుల స్కోర్ను కాపాడుకోలేక సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మార్క్రమ్.. బ్యాటింగ్లో 20 పరుగులు తక్కువగా చేయడం ఓటమికి కారణమైందన్నాడు. 'మేం చేసిన 180 పరుగుల స్కోర్ విజయానికి సరిపోతుందనుకున్నా. మేం అద్భుతంగానే బ్యాటింగ్ చేశాం. కానీ ఒక్క భాగస్వామ్యం దొరికి ఉంటే సునాయసంగా 200 పరుగుల మార్క్ అందుకునేవాళ్లం. మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ వికెట్ చాలా నెమ్మదించింది.

అందుకు అనుగుణంగా బౌలింగ్లో మేం మంచి ఆరంభాన్ని అందుకున్నాం. అభిషేక్ శర్మ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. వికెట్ను వికెట్ వేయమని అభిషేక్కు చెప్పా. కానీ అతను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్ వంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్నప్పుడు ఒత్తిడికి లోనవ్వడం సహజమే. అప్పుడే మన అసలు సిసలు సత్తా తెలుస్తోంది.
గ్లేన్ ఫిలిప్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో నేను చేయాల్సిన అవసరం కనిపించలేదు. రైట్ హ్యాండర్స్ ఆడుతున్నప్పుడు నేను వేయకపోవడమే మంచిదనిపించింది. చివరి మూడు మ్యాచ్ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తాం.'అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 47), అబ్దుల్ సమద్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 37 నాటౌట్) రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. యుధ్వీర్ సింగ్, ఆవేశ్ ఖాన్, యశ్ థాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 185 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యువ ప్లేయర్ ప్రేరక్ మన్కడ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మార్కస్ స్టోయినీస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 40), నికోలస్ పూరన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సన్రైజర్స్ బౌలర్లలో ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ తలో వికెట్ తీసారు.