హైదరాబాద్: కోల్కతా నైట్రైడర్స్తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలవ్వడం చాలా నిరాశకు గురిచేసిందని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మార్క్రమ్.. మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతోనే గెలిచే మ్యాచ్లో ఓటమిపాలయ్యామని చెప్పాడు.
'ఈ మ్యాచ్లో చాలా భాగం మేమే అద్భుత ప్రదర్శన కనబర్చాం. కానీ దురదృష్టవశాత్తు చివరి నిమిషంలో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. హెన్రీచ్ క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలో నేను కాస్త తడబడ్డాను. కీలక భాగస్వామ్యం నెలకొల్పాలనే ఉద్దేశంతో నిదానంగా ఆడాను.

క్లాసెన్ మాత్రం సూపర్ బ్యాటింగ్తో నాపై ఉన్న ఒత్తిడిని తగ్గించాడు. చివరకు నేను రిథమ్ను అందుకున్నాను. కానీ మేం నెలకొల్పిన భాగస్వామ్యాలను ఇంకాస్త పొడిగించాల్సింది. విజయాలు సాధించాలంటే ఈ తరహా భాగస్వామ్యాలను చివరి వరకు తీసుకెళ్లాలి. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్లోనూ మా కుర్రాళ్లు సత్తా చాటారు.
బ్యాటింగ్లోనూ కొన్ని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాం. కానీ అవి మా విజయానికి సరిపోలేవు. ప్లే ఆఫ్స్ చేరాలంటే మేం ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. ఈ కఠిన పరిస్థితులు మా అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీస్తాయని ఆశిస్తున్నా.'అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42), రింకూ సింగ్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) రాణించారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఎయిడెన్ మార్క్రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్(40 బంతుల్లో 4 ఫోర్లతో 41), హెన్రీచ్ క్లాసెన్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 36) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తీ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్ను గెలిపించాడు.