
న్యూఢిల్లీ: బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే భారత్తో రెండో వన్డేలో ఓటమిపాలయ్యామని సౌతాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ అన్నాడు. తాము అదనంగా మరో 15-20 పరుగులు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎయిడెన్ మార్క్రమ్ ఈ ఓటమిపై స్పందించాడు. విజేతగా నిలవాల్సిన తమ జట్టు ఓటమిపాలవ్వడానికి తాను కూడా ఓ కారణమేనని తెలిపాడు.
'టీమిండియా బాగా ఆడింది. బ్యాటింగ్కు మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. జట్టు బాగా ఆడలేకపోతే ఫీల్డింగ్లో కూడా పొరపాట్లు దొర్లుతాయి. ఇన్నింగ్స్ పూర్తి చేయకుండానే నేను ఔటవ్వడం వల్ల 15-20 పరుగులు చేయకుండా వెనుకబడిపోయాం. నేను చివరి ఓవర్ల వరకు ఆడగలిగి ఉంటే బాగుండేది. భారత జట్టు మెరుగ్గా ఆడింది. మరోవైపు పరిస్థితులు కఠినంగా మారాయి. అందుకే మంచి ఫామ్లో కొనసాగుతున్న డేవిడ్ మిల్లర్ సైతం కష్టపడాల్సి వచ్చింది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కలిసి అద్భుతంగా ఆడారు. జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు'' అని తెలిపాడు.
సెంచరీ కొడతాడనుకున్న మార్క్రమ్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో 79 పరుగుల వద్ద వెనుదిరగడంతో సౌతాఫ్రికా ఆపై పరుగులు చేసేందుకు కష్టపడింది.
శ్రేయస్ అయ్యర్ (111 బాల్స్లో 15 ఫోర్లతో 113 నాటౌట్) క్లాసిక్ సెంచరీకి తోడు హోమ్ టౌన్ రాంచీలో యంగ్స్టర్ ఇషాన్ కిషన్ (84 బాల్స్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 93) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్తో రప్ఫాడించడంతో భారత్ ఘన విజయాన్నందుకుంది. దాంతో, మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయ్యింది. తొలుత హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (10-1-38-3) కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకోవడంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 278/7 స్కోరు చేసింది.
మార్క్రమ్ (79), రీజా హెండ్రిక్స్ (74) సత్తా చాటారు. అనంతరం శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మూడో వికెట్కు 161 రన్స్ పార్ట్నర్షిప్తో ఇండియా 45.5 ఓవర్లలోనే 282/3స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కెరీర్లో రెండో సెంచరీ సాధించిన శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డే మంగళవారం ఢిల్లీ వేదికగా జరుగనుంది.