మిడిల్ ఓవర్లలో డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ నెలకొల్పిన భాగస్వామ్యమే తమకు విజయాన్ని కట్టబెట్టిందని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తెలిపాడు. టీమిండియా ఓటమికి కూడా ఈ భాగస్వామ్యమే కారణమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ఇరు జట్ల మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం కూడా ఇదేనని మార్క్రమ్ స్పష్టం చేశాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన సూపర్-8 మ్యాచ్లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన మార్క్రమ్.. డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్లతో పాటు తమ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.
'ఇది ఒక గొప్ప ప్రదర్శన. గతంలో ఇక్కడ మేం ఆడిన వికెట్లతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంది. మా కుర్రాళ్లు పిచ్ను
ముందుగానే అంచనా వేసి.. వారి ప్రణాళికలను అందుకు అనుగుణంగా మార్చుకున్నారు. బౌలర్ల విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ టోర్నీ ఆరంభం మాకు కష్టంగా అనిపించింది. కానీ ఈ రాత్రి మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. బ్రెవిస్, మిల్లర్ నెలకొల్పిన భాగస్వామ్యం మమ్మల్ని ఆటలో నిలబెట్టింది. పిచ్పై బంతి వేగంగా రాలేదు. ఆగుతూ వచ్చింది. దాంతో ఖాళీ ప్రదేశాల్లోకి బంతిని బాది, వేగంగా పరుగెత్తడానికి ప్రయత్నించాం.
భారత బౌలర్లు ఆరంభంలోనూ.. చివర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ మిడిల్ ఓవర్లలో మా బ్యాటింగే రెండు జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసాన్ని చూపింది. ఫీల్డింగ్లో మంచి ప్రయత్నమే చేసినప్పటికీ, రెండు క్యాచ్లు వదిలేశాం. గతంలో యూఏఈతో జరిగిన మ్యాచ్లో మేము అంతగా సమన్వయంతో లేం. కానీ ఈరోజు మా ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది.

లుంగి ఎన్గిడి ఎప్పుడు బౌలింగ్ చేసినా ప్రత్యర్థికి ముప్పుగానే భావిస్తాం. అతను మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగలడు. అతను మైదానంలోకి దిగి తన ప్రదర్శనను నిలకడగా అందిస్తూనే ఉంటాడు. వెస్టిండీస్తో ఈ టోర్నీకి ముందే ఆడాం. అది రెండు జట్లకు సమానంగా ఉపయోగపడుతుంది. వారిది చాలా ప్రమాదకరమైన జట్టు. ఈ రాత్రికి ఈ విజయాన్ని ఆస్వాదించి.. ఆ తర్వాత తదుపరి మ్యాచ్పై ఫోకస్ పెడ్తాం. మాకు అది బిగ్ మ్యాచ్. మేం మళ్ళీ పూర్తి శక్తితో ఆ మ్యాచ్పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.'అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 45), ట్రిస్టన్ స్టబ్స్(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 44 నాటౌట్) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/15) మూడు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్దీప్ సింగ్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు. డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ నాలుగో వికెట్కు 97 పరుగులు జోడించారు.
అనంతరం టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. శివమ్ దూబే(37 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 42 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(4/22) నాలుగు వికెట్లు, కేశవ్ మహరాజ్(3/24) మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్రమ్ ఒక వికెట్ పడగొట్టాడు.