భారత బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు వరుసగా వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తెలిపాడు. తమ జట్టు 140-150 పరుగల లక్ష్యాన్ని నమోదు చేసి ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగేదని అభిప్రాయపడ్డాడు. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మార్క్రమ్ బ్యాటింగ్ వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. భారత బౌలర్లతో పాటు అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తమ పతనాన్ని శాసించిందని అభిప్రాయపడ్డాడు.
'బ్యాటింగ్కు కఠినమైన పరిస్థితులు. భారత బౌలర్లు సరైన లెంగ్త్లో బౌలింగ్ చేశారు. మేం వరుసగా 4-5 వికెట్లు కోల్పోయాం. భారత బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. టెస్ట్ మ్యాచ్ డెలివరీలు వేసారు. వాటిని ఎదుర్కోవడం సవాల్గా మారింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. వాటిని ఎదుర్కోవడానికి, తిరిగి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన మార్గాలు కనుగొనాలి.

భారత్ మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. వారు మాకు పరుగులు చేసే అవకాశం ఇవ్వలేదు. నేను ఇన్నింగ్స్ను చివరి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాను. ఒకవేళ నేను జట్టుకు 140-150 పరుగుల స్కోర్ అందించి ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా జరిగేది. డెత్ ఓవర్లలోనే నేను ఔటైన బంతి భారీ షాట్ కొట్టగలిగేదే. ఈ మ్యాచ్ గురించి మేం ఎక్కువగా ఆలోచించడం లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వాటిని తిప్పికొట్టే మార్గాలను సిద్దం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో టార్గెట్ చేయాలనుకునే బౌలర్ను ఎంచుకోవాలి. అందరిపై ఎదురుదాడి చేయకుండా ఒక్క బౌలర్పై మాత్రమే విరుచుకుపడాలి.
భారత్ ఆరంభం బాగుంది. వారు ఎప్పుడూ స్పష్టమైన ప్రణాళికతో ఆడుతున్నారు. ఈ క్రెడిట్ పూర్తిగా అభిషేక్ శర్మదే. అతను అద్భుతంగా ఆడాడు. ఆరంభంలో మేం సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయలేదు. దాంతో భారత్ పవర్ ప్లేలోనే 60 ప్లస్ రన్స్ చేసింది. ఆ తర్వాత మేం అద్భుతంగా బౌలింగ్ చేసి పుంజుకున్నాం. మంచి లెంగ్త్ల్లో బౌలింగ్ చేయడం ద్వారా ఆటను సాగదీసాం. ఇది ఒక సానుకూల అంశం.'అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 117 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో డోనవన్ ఫెర్రెయిరా(15 బంతుల్లో ఫోర్, సిక్స్తో 20), అన్రిచ్ నోర్జ్(12) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/25), హర్షిత్ రాణా(2/34), వరుణ్ చక్రవర్తీ(2/11), కుల్దీప్ యాదవ్(2/12) రెండేసి వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 35) తన జోరు కొనసాగించగా.. శుభ్మన్ గిల్(28 బంతుల్లో 5 ఫోర్లతో 28), సూర్యకుమార్ యాదవ్(11 బంతుల్లో 2 ఫోర్లతో 12) మరోసారి తడబడ్డారు. తిలక్ వర్మ(34 బంతుల్లో 3 ఫోర్లతో 26 నాటౌట్), శివమ్ దూబే(4 బంతుల్లో ఫోర్, సిక్స్తో 10 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.