బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అన్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్లో మెరుగైన ప్రదర్శన చేసినా.. బ్యాటింగ్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయామని అంగీకరించాడు. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 101 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 74 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మార్క్రమ్.. బ్యాటింగ్ వైఫల్యం తమ పతనాన్ని శాసించిందని చెప్పాడు. 'మేం బౌలింగ్, ఫీల్డింగ్లో మెరుగైన ప్రదర్శన చేశాం. ఈ మ్యాచ్ను మేం ప్రారంభించిన విధానం కూడా బాగుంది. మెరుగ్గా ఆరంభించడంపై మేం ఫోకస్ పెట్టాం. ఆ లక్ష్యాన్ని కూడా అందుకున్నాం. కాబట్టి ఈ మ్యాచ్లో ఓడినా మా ప్రదర్శన పట్ల గర్వపడవచ్చు. దురదృష్టవశాత్తు బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం.
అయితే ఈ ఫార్మాట్ ఇలా జరగడం సర్వ సాధారణం. అయితే తొలి మ్యాచ్లోనే ఇలా జరగడం బాధాకరం. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ను మరిచిపోయి తదుపరి మ్యాచ్కు సిద్దం కావాలి. రెండు రోజుల్లోనే మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ పిచ్ చాలా స్టిక్కీగా ఉంది. బంతి ఆగుతూ వచ్చింది. టెన్నిస్ బాల్ బౌన్స్ కూడా ఉంది. 175 పరుగుల లక్ష్యాన్ని మేం ఛేదించాల్సింది. ఈ లక్ష్యాన్ని ఛేదిస్తామని మేం అనుకున్నాం. ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి మరో 10-15 పరుగులు తక్కువగా ఇవ్వాల్సిందని చెప్పవచ్చు. కానీ 175 పరుగుల లక్ష్యం ఏం పెద్దది కాదు. మేం బ్యాట్తో కాస్త మెరుగ్గా ఆడాల్సింది. దురదృష్టవశాత్తు బ్యాటింగ్లో రాణించలేకపోయాం.

ఈ రోజుల్లో టీ20 క్రికెట్లో పరిస్థితులను అందిపుచ్చుకునే సమయం దొరకడం లేదు. భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం, వికెట్లు కోల్పోవడం, స్థిరంగా ఆడలేకపోవడం, మా వైపు మూమెంటమ్ తీసుకురాకపోవడం ఓటమిని శాసించాయి. మా తప్పిదాల గురించి మేం మాట్లాడుకుంటాం. అయితే వీటికి మరి లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ మరిచి.. ఈ ఫార్మాట్లో ఉన్న సానుకూల అంశాలపై ఫోకస్ పెట్టాలి.'అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(3/31) మూడు వికెట్లు తీయగా.. లుతో సిపమ్లా(2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. డోనోవన్ ఫెర్రెరియా ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డెవాల్డ్ బ్రెవిస్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(2/14), జస్ప్రీత్ బుమ్రా(2/17), వరుణ్ చక్రవర్తీ(2/19), అక్షర్ పటేల్(2/7) రెండేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు.