
న్యూఢిల్లీ: అప్కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్లో పోటీపడనున్న కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్ తమ తమ జట్టుకు 'అహ్మదాబాద్ టైటాన్స్' అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని ఈ ఫ్రాంఛైజీని నడుపుతున్న సీవీసీ క్యాపిటల్ సోమవారం వెల్లడించింది. ఈనెల 12-13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్న నేపథ్యంలో సీవీసీ ప్రకటన చేసింది. అహ్మదాబాద్ జట్టుకు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
ఈ జట్టును సీవీసీ క్యాపిటల్ రూ.5625 కోట్లకు సొంతం చేసుకుంది. పికప్ ఆప్షన్స్ కింద అహ్మదాబాద్ జట్టు.. హార్దిక్ పాండ్యా(రూ.15 కోట్లు)తో పాటు రషీద్ ఖాన్(రూ.15 కోట్లు), శుభ్మన్ గిల్(రూ.8 కోట్లు) లాంటి స్టార్ ఆటగాళ్లను తీసుకుంది. ఈ ముగ్గురి కోసం రూ. 38 కోట్లను ఖర్చు చేసిన అహ్మదాబాద్ దగ్గర ఇంకా రూ.52 కోట్ల పర్స్ మనీ ఉంది. వేలంలో నిఖార్సయిన ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఆ జట్టుకు ఉంది.

ఇప్పటికే టీమ్ హెడ్ కోచ్గా ఆశిష్ నెహ్రా, మెంటార్గా గ్యారీ కిర్స్టన్లను నియమించుకున్న అహ్మదాబాద్.. లోగోను ప్రకటించాల్సి ఉంది. ఇక అహ్మదాబాద్తోనే లీగ్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో.. టీమ్ పేరుతో పాటు లోగోను ఇప్పటికే ప్రకటించింది. రూ.7090 కోట్ల భారీ ధరకు లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న ఆర్పీఎస్ గోయింకా సంస్థ, తమ జట్టు పేరును లక్నో సూపర్ జెయింట్స్గా నామకరణం చేసింది.
కేఎల్ రాహుల్(17 కోట్లు)ను కెప్టెన్గా, ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్(9.2 కోట్లు), రవి బిష్ణోయ్(4 కోట్లు)లను వేలానికి ముందు పికప్ చేసుకుంది. ఈ జట్టుకు కోచ్గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించనుండగా.. మెంటార్గా గౌతం గంభీర్ నియమితుడయ్యాడు.