పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అనాలోచిత నిర్ణయాలే తమ జట్టు ఘోర పరాజయానికి ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ అహ్మద్ షేహ్జాద్ అన్నాడు. తన జీవితంలో ఇప్పటివరకు పాకిస్థాన్ టీమ్ ఇంతలా దిగజారడం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయం నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే షేహ్జాద్ అహ్మద్ చేసి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాకిస్థాన్ క్రికెట్ పెద్దల కారణంగానే జట్టుకు ఈ గతి పట్టిందని విమర్శించాడు. 'నాకు తెలిసి పాకిస్థాన్ క్రికెట్లో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ గురించి పక్కనబెట్టి పాకిస్థాన్ వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమి నుంచి తేరుకోవడం చాలా కష్టం.

గతంలో అఫ్గానిస్థాన్పైనా పాకిస్థాన్ ఇలానే ఓటమిపాలైంది. పాక్ పరాజయానికి ఆటగాళ్లను నిందించలేం. పాకిస్థాన్ ప్రదర్శన దిగజారడానికి బోర్డు పెద్దలదే అసలైన పాత్ర. ఎప్పుడూ స్వల్ప కాలిక నిర్ణయాలు తీసుకోవద్దు. రానురాను పాకిస్థాన్ హాకీలా క్రికెట్ మారే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు బంగ్లాదేశ్ చాలా అద్భుతంగా ఆడింది. ఈ పరాజయానికి పీసీబీనే బాధ్యత వహించాలి.
దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఆటగాళ్లకు అవకాశం దక్కడం లేదు. దేశవాళీ ఆటగాళ్ల కోసం సరైన వ్యవస్థ లేదు. కుర్రాళ్లను పట్టించుకోకపోతే.. సీనియర్లను భర్తీ చేసేదెవరు..? తాజా పరాజయంతో పాకిస్థాన్ క్రికెట్పై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలనున్నాయి. 'అని షెహ్జాద్ ఘాటుగా స్పందించాడు.
డ్రా దిశగా సాగిన ఈ మ్యాచ్ను అసాధారణ పోరాటంతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ను 448/6 డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. శద్మాన్ ఇస్లామ్ (93), మెహదీ హసన్ (77) రాణించారు.
నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, షాజాద్, మహ్మద్ అలీ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, 117 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్ (51; 80 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్ షఫికీ (37), బాబర్ అజామ్ (22) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మెహదీ హసన్ నాలుగు, షకిబ్ అల్ హసన్ మూడు వికెట్లతో చెలరేగారు.
అనంతరం 30 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు జకీర్ హసన్ (15 నాటౌట్; 26 బంతుల్లో, 3 ఫోర్లు), షద్మాన్ (9 నాటౌట్; 13 బంతుల్లో, 1 ఫోర్) జట్టును విజయతీరాలకు చేర్చారు.