ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకరించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఆ జట్టు వెటరన్ బ్యాటర్ అహ్మద్ షెజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకొని పీసీబీ బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుందని అభిప్రాయపడ్డాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి ఐసీసీ తెరదించిన విషయం తెలిసిందే. హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరుగుతుందని ఐసీసీ గురువారం ప్రకటించింది. భారత్ మ్యాచ్లు తటస్థ వేదికగా జరుగుతాయని వెల్లడించింది. అదే విధంగా 2027 వరకు భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ కూడా తటస్థ వేదికగా మ్యాచ్లు ఆడుతుందని పేర్కొంది. అతి త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను విడుదల చేస్తామని తెలిపింది.

గోల్డెన్ ఛాన్స్ మిస్..
కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్న భారత్, పాక్ జట్లు ఇక నుంచి తటస్థ వేదికల్లో ఆడనుండటంపై అహ్మద్ షెజాద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ద్వారా భారత జట్టుకు ఆతిథ్యమిచ్చే బంగారం లాంటి అవకాశం పాకిస్థాన్కు వచ్చింది. అన్ని క్రికెట్ బోర్డులు ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్లో నిర్వహించేందుకు అంగీకరించాయి. అగ్రిమెంట్పై సంతకాలు కూడా చేశాయి.
ఈ విషయంలో ఐసీసీకి ఏ మాత్రం వెనకడుగు వేసే అవకాశం లేదు. కానీ పీసీబీ ఈ అవకాశాన్ని చేజార్చుకుంది.ఇక భారత జట్టు పాకిస్థాన్లో పర్యటిస్తుందనే విషయాన్ని మనమంతా మర్చిపోవాలి. ఐసీసీ ఈవెంట్ ద్వారానే భారత్ను పాకిస్థాన్కు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కూడా పాక్ వదులుకుంది.
బోర్డర్లో స్టేడియం..
ఇటీవలే నేను ఓ పోడ్కాస్ట్ చేశాను. అందులో భారత్, పాకిస్థాన్ జట్లకు ఓ సలహా ఇచ్చాను. ఇరు దేశాల సరిహద్దులో స్టేడియం నిర్మించి ఓ గేట్ పాకిస్థాన్వైపు.. మరో గేట్ భారత్వైపు పెట్టాలని సూచించాను. ఇరు జట్ల ఆటగాళ్లు తమ దేశం వైపు ఉన్న గేట్లలో నుంచి వచ్చి ఆడుతారు. ఇందుకు కూడా భారత ఆటగాళ్లకు, ఆ దేశ ప్రభుత్వానికి ఇబ్బంది కలగవచ్చు. ఎందుకంటే ఆ దేశ ఆటగాళ్లు మా దేశం వైపు ఉన్న మైదానంలోకి రావాలంటే వీసాలు కావాలేమో'అని షెజాద్ అహ్మద్ సెటైర్లు పేల్చాడు.
2012-13 తర్వాత ఇరు దేశాల మధ్య క్రికెట్ సత్సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారత్ చివరిసారిగా 2008లో పాకిస్థాన్లో ఆసియాకప్ కోసం పర్యటించింది. అప్పటి నుంచి కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. పాకిస్థాన్ మాత్రం 2016 టీ20 ప్రపంచకప్తో పాటు వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత్లో పర్యటించింది.