న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎదుగుదలను మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఓర్వలేకపోతున్నాడని పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహ్జాద్ ఆరోపించాడు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా విరాట్ కోహ్లీతో గౌతమ్ గంభీర్ గొడవపడటాన్ని షెహ్జాద్ తప్పుబట్టాడు. నవీన్ ఉల్ హక్ కోసం కోహ్లీ పట్ల గంభీర్ అసభ్యకరంగా ప్రవర్తించడం సరికాదన్నాడు.
కోహ్లీ స్థానంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉండి, నవీన్ ఉల్ హక్పై స్లెడ్జింగ్కు దిగి ఉంటే గంభీర్ ఇలానే గొడవపడేవాడా? అని షెహ్జాద్ ప్రశ్నించాడు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య లక్నో వేదికగా జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో గంభీర్-కోహ్లీ గొడవపడ్డారు.

ఈ సీజన్ తొలి మ్యాచ్లో లక్నో విజయానంతరం ఆ జట్టు మెంటార్ గంభీర్.. ఆర్సీబీ అభిమానుల ఉద్దేశించి గమ్మున ఉండాలని సైగలు చేస్తూ అతిగా ప్రవర్తించాడు. లక్నో ట్విటర్ హ్యాండిల్లో కూడా ఆర్సీబీ ఆటను హేళన చేశారు. వీటిని మనసులో పెట్టుకున్న ఆర్సీబీ రెండో మ్యాచ్లో విజయంతో బదులిచ్చింది. ఈ క్రమంలో ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం నడిచింది.
లక్నో యువ పేసర్ నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో ఈ ఇద్దరూ మరోసారి గొడవపడ్డారు. దాంతో ఆగ్రహానికి గురైన గంభీర్.. కోహ్లీతో గొడవకు దిగాడు. ఈ సీజన్లోనే ఈ ఘటన అత్యంత వివాదాస్పదంగా మారింది.
ఈ ఘటనపై గంభీర్ తన తప్పులేదంటూ వివరణ ఇచ్చుకున్నా.. కోహ్లీ మాత్రం స్పందించలేదు. తాజాగా ఓ యూట్యూట్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అహ్మద్ హెహ్జాద్ ఈ ఘటనపై మాట్లాడుతూ గంభీర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఆ ఘటన తర్వాతి రోజు ఒకరు నాకు ఓ క్లిప్ పంపించారు.
అందులో గౌతమ్ గంభీర్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను విరాట్ కోహ్లీకి ఇచ్చానని చెప్పాడు. అయితే ఆ అవార్డు ఇవ్వాలని కోహ్లీ ఏమైనా గంభీర్ అడిగాడా? లేక గొడవకు నష్టపరిహారంగా అతనే ఇచ్చాడా? అనేది నాకు అర్థం కాలేదు. ఇది ఎలా ఉందంటే? కోహ్లీ ఎదుగుదలను, అతనికి దక్కుతున్న గౌరవం చూసి గంభీర్ ఓర్వలేకపోతున్నాడనిపిస్తోంది.
యుక్త వయసులోనే అతని కంటే కోహ్లీ ఎక్కువ పేరు తెచ్చుకోవడాన్ని గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇదే ఐపీఎల్లో విరాట్ కోహ్లీ స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉండి.. నవీన్ ఉల్ హక్పై స్లెడ్జింగ్కు దిగితే గంభీర్ ఇలానే గొడవపడేవాడా? గంభీర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే?.. విరాట్ కోహ్లీని ఈ తరం.. రారాజుగా పరిగణిస్తోంది. అతను 75 సెంచరీలు చేశాడు.
గంభీర్కు ఇది గొప్ప ఘనత కాకపోవచ్చు. కానీ క్రికెట్ అభిమానులుగా మాకు గొప్ప విషయమే. దేశం, మతంతో సంబంధం లేకుండా ఆటగాళ్లను మేం ఆరాధిస్తాం. విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్. అందరి గౌరవాన్ని స్వీకరించేందుకు అతను అన్ని విధాల అర్హుడు.'అని షెహ్జాద్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.