టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ ఓపెనర్ అహ్మద్ షెహ్జాద్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ప్రపంచంలోనే మరే ఆటగాడిని విరాట్ కోహ్లీతో పోల్చలేమని చెప్పాడు. కోహ్లీ కోహ్లీనేనని, అతని రికార్డులు, పరుగుల గణంకాలే అతను ఏంటో తెలియజేస్తాయన్నాడు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ కూడా కోహ్లీ ముందు సరితూగడని అహ్మద్ షెహ్జాద్ అన్నాడు. తాజాగా ఓ పాకిస్థాన్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అహ్మద్ షెహ్జాద్ ఆస్తకికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్లో ఎవరు గొప్ప బ్యాట్స్మన్ అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు.

విరాట్ కోహ్లీతో ఎవరిని పోల్చలేమని స్పష్టం చేశాడు. 'ఈ ప్రపంచంలో ఎవరిని విరాట్ కోహ్లీతో పోల్చలేం. బాబర్ ఆజామ్ ఒక్కడే కాదు నాతో సహా మరెవరూ విరాట్ కోహ్లీతో సరితూగలేరు. మూడు ఫార్మాట్లలో అతని ప్రదర్శన, పరుగుల గణంకాలు, రికార్డులు విరాట్ కోహ్లీ ఏంటో తెలియజేస్తాయి.'అని అహ్మద్ షెహ్జాద్ చెప్పుకొచ్చాడు.
ఇక తన బయోపిక్లో ఏ హీరో నటించాలనుకుంటున్నారని ప్రశ్నించగా.. తనదైన శైలిలో స్పందించి నవ్వలు పూయించాడు. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తన బయోపిక్లో నటించాలనుకుంటున్నట్లు చెప్పాడు.
ఇక పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) నుంచి అహ్మద్ షెహ్జాద్ రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు అతన్ని తీసుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను ఈ టీ20 లీగ్కు వీడ్కోలు పలికాడు.
పాకిస్థాన్ తరఫున 13 టెస్ట్లు, 81 వన్డేలు, 59 టీ20లు ఆడిన అహ్మద్ షెహ్జాద్.. మూడు ఫార్మాట్లలో కలిపి 5 వేల పరుగులు చేశాడు. ఓవరాల్గా 10 సెంచరీలు, 25 అర్థ శతకాలు నమోదు చేశాడు.