టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహ్జాద్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ తమ తరం దిగ్గజమని కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్ను అందుకుంది. ఫైనల్లో టాప్-3 బ్యాటర్లు విఫలమైన వేళ విరాట్ కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఆచితూచి బ్యాటింగ్ చేసిన కోహ్లీ 76 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ టోర్నీలో టీమిండియా విజేతగా నిలవడంపై స్పందించిన షెహ్జాద్ అహ్మద్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీనే గెలిపించాడు..
విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్తోనే టీమిండియా విజేతగా నిలిచిందని చెప్పాడు. కోహ్లీనే 76 పరుగులు చేయకపోతే టీమిండియాకు ఘోర పరాజయం ఎదురయ్యేదని అభిప్రాయపడ్డాడు. క్లిష్టపరిస్థితుల్లో తన అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడని కొనియాడాడు.
కోహ్లీ ఓ దిగ్గజమని, అతనితో ఎవరూ పోటీ పడలేరని చెప్పాడు. ఎవరూ కూడా బాబర్ ఆజామ్ను కోహ్లీతో పోల్చవద్దని, అతని కాలి గోటికి కూడా బాబర్ సరిపోడని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

ఈ జనరేషన్ దిగ్గజం..
'మా జనరేషన్లో విరాట్ కోహ్లీ ఓ దిగ్గజం. మైదానంలో అడుగుపెట్టిన ప్రతీసారి అతను ఒకే ఉత్సాహంతో బ్యాటింగ్ చేస్తాడు. తన ఆఖరి టీ20 మ్యాచ్లోనూ కోహ్లీ అదే జోరు కొనసాగించాడు. లాంగాన్, లాంగాఫ్లో ఫీల్డింగ్ చేసిన కోహ్లీ.. వికెట్ పడిన ప్రతీసారి సంబరాలు చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ మొత్తం అతను పరుగులు చేయలేదు.
కానీ దేవుడి రాసిన రాతనో ఏమో కానీ కీలక ఫైనల్లో మాత్రం సత్తా చాటాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైనా వేళ సూపర్ బ్యాటింగ్తో రాణించాడు. విరాట్ కోహ్లీ ఆసాధారణ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే టీమిండియా ప్రపంచకప్ గెలిచేది కాదు. టీ20 క్రికెట్లో అతను గొప్ప వారసత్వాన్ని మిగిల్చాడు.
కోహ్లీతో ఎవరూ సరితూగరు..
అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న భారత క్రికెట్కు గుడ్ లక్. కోహ్లీతో మరే ఆటగాడిని పోల్చవద్దు. బాబర్ ఆజామ్ అతని కాలి గోటికి కూడా సరిపోడు.'అని అహ్మద్ షెహ్జాద్ మీడియా ప్రతినిధులతో అన్నాడు.