కొలంబో: టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున 250 వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా స్టార్ పేసర్ టిమ్ సౌతీ అరుదైన ఘనతను అందుకున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో సారా ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతీ శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేను ఔట్ చేయడం ద్వారా 250 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్కు ముందు 245 టెస్టు వికెట్లతో ఉన్న టిమ్ సౌథీ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు సాధించాడు.
విమర్శల ప్రభావం నాపై పడకుండా జాగ్రత్త పడ్డా: రహానే
ఇదిలా ఉంటే.. టెస్టు ఫార్మాట్లో 1500 వందలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు, 45కి పైగా క్యాచ్లు పట్టిన ఎనిమిదో ఆటగాడిగా సౌతీ మరో ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్), కపిల్ దేవ్ (భారత్), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), అనిల్ కుంబ్లే ( భారత్), షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా), జాక్వస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా), డానియెల్ వెటోరి (న్యూజిలాండ్)లు ఉన్నారు. తాజాగా వీరి సరసన సౌతీ నిలిచాడు. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకూ సౌతీ 1611 పరుగులు చేయగా, 251 వికెట్లను సాధించాడు.
లంకతో ఇటీవలే కొలంబో వేదికగా జరిగిన తొలి టెస్టులో మరో స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సైతం 250 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో రిచర్డ్ హ్యాడ్లీ (431) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో డానియెల్ వెటోరి (361), ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీలు ఉన్నారు. సౌతీ 67వ టెస్టు మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. సౌతీ 2008లో ఇంగ్లాండ్పై టెస్టు అరంగేట్రం చేశాడు. రెండో టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది.