
గందరగోళంలో అఫ్గాన్ క్రికెటర్ల భవిష్యత్తు
అయితే అఫ్గానిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో.. అక్కడి క్రికెటర్లు భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్ లాంటి వాళ్లు ఇప్పుడు వచ్చే నెలలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో అయినా ఆడతారా లేదా అన్నది అనుమానంగా మారింది.
రషీద్, నబీ క్రికెటర్లు ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో లేరు. హండ్రెడ్ టోర్నీలో ఆడటానికి యూకేలో ఉన్నారు. రషీద్ ట్రెంట్ రాకెట్స్కు, నబీ లండన్ స్పిరిట్స్కు ఆడుతున్నారు. అయితే వీళ్లు అక్కడి నుంచి నేరుగా యూఏఈ వచ్చి ఐపీఎల్ 14 రెండో దశలో పాల్గొంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

యూకేలోనే ఉంటే
అయితే రషీద్ ఖాన్, మహ్మద్ నబీ వస్తారన్న నమ్మకం తమకు ఉన్నదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ధీమా వ్యక్తం చేస్తోంది. 'ఇప్పుడే దీనిపై కామెంట్ చేయలేం. అయితే పరిస్థితులను గమనిస్తున్నాం. మా వరకూ ఏ మార్పులూ లేవు. రషీద్తో పాటు ఇతర ప్లేయర్స్ ఐపీఎల్లో పాల్గొంటారు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 21న హండ్రెడ్ టోర్నీ ముగుస్తోంది. ఆ తర్వాత కూడా రషీద్, నబీ యూకేలోనే ఉంటారో లేదో స్పష్టమైన సమాచారం లేదు. ఒకవేళ వాళ్లు యూకేలోనే ఉంటే.. ఆ క్రికెటర్లను మన వాళ్లతో కలిపి తీసుకువచ్చే ప్రయత్నం బీసీసీఐ చేయవచ్చు. రషీద్, నబీ ఇద్దరూ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు ఆడుతున్నారు. వారు రాకుంటే మాత్రం మన తెలుగు జట్టుకు పెద్ద లోటనే చెప్పాలి.

ఐపీఎల్ 2021, టీ20 ప్రపంచకప్ డౌటే
సంక్షోభంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఈ నెలలోనే ఆఫ్ఘనిస్థాన్ టీమ్ శ్రీలంక టూర్ కూడా వెళ్లాల్సి ఉంది. ఆపై ఆస్ట్రేలియాతో ట్రై సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసింది. ఈ రెండు పర్యటనలు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఐపీఎల్ 2021 ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ అనుమానంగా మారగా.. ఆ వెంటనే జరిగే టీ20 ప్రపంచకప్లలో ఆ దేశ టీం పాల్గొనడం కూడా డౌటే. టీ20 ప్రపంచకప్లో గ్రూప్-బిలో అఫ్గానిస్థాన్ ఉండగా.. ఆ గ్రూప్లో భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. అఫ్గానిస్థాన్ టాప్ జట్లను ఓడించడం కష్టమే. రషీద్ అఫ్గాన్ తరఫున 5 టెస్టులు, 74 వన్డేలు, 51 టీ20లు ఆడాడు.

సహచర బౌలర్లు పరుగులు ఇచ్చినా
ఐపీఎల్ 2021లో రషీద్ ఖాన్ రాణించాడు. సహచర బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చినా.. అతడు మాత్రం ప్రత్యర్థి బ్యాట్స్మన్ను కట్టడిచేశాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది.
7 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. బయో బబుల్ మధ్య సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021పై కరోనా కమ్మేసింది. లీగ్ వాయిదా పడే సమయానికి 29 మ్యాచ్లు పూర్తవ్వగా.. మరో 31 మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంది. అయితే సెప్టెంబర్లో ఈ క్యాచ్ రిచ్ లీగ్ సెకండ్ ఫేజ్ను బీసీసీఐ నిర్వహించనుంది.


Click it and Unblock the Notifications

India vs England: అప్పుడు సౌరవ్ గంగూలీ.. ఇప్పుడు విరాట్ కోహ్లీ! లార్డ్స్ బాల్కనీలో టీమిండియా కెప్టెన్ల హవా!!