బాల్కనీలో ఎంజాయ్
లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ జరుగుతోంది. ఆదివారం మ్యాచ్లో నాలుగో రోజు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరగానే పెవిలియన్ చేరారు. చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే తన అనుభవంతో భారత జట్టు ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. ఒకవైపు భారత బ్యాట్స్మెన్ మైదానంలో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొంటుండగా, మరోవైపు బాల్కనీలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తోటి ఆటగాళ్లతో సరదాగా గడిపాడు. కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్తో సహా జట్టులోని కొంతమంది సభ్యులతో కలిసి లార్డ్స్ గ్రౌండ్ బాల్కనీలో ఎంజాయ్ చేశాడు.

కోహ్లీ నాగినీ డాన్స్
అప్పటివరకు తోటి ఆటగాళ్లతో కలిసి లార్డ్స్ బాల్కనీలో కూర్చున్న విరాట్ కోహ్లీ.. ఒక్కసారిగా లేచి నాగినీ డాన్స్ చేశాడు. ఇది చూసిన కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్, ఇతర సిబ్బంది తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబందించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కోహ్లీ బాల్కనీలో నాగినీ డ్యాన్స్ భంగిమలో కనిపించడంతో భారత అభిమానులు టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లార్డ్స్లో చేసిన హంగామాను గుర్తుచేసుకుంటున్నారు. నాట్వెస్ట్ ట్రోఫీలో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత గంగూలీ చొక్కా విప్పి గిరగిరా తిప్పుతూ సందడి చేసిన విషయం తెలిసిందే. 'లార్డ్స్ బాల్కనీలో టీమిండియా కెప్టెన్ల హవా' అంటూ ఫాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
India vs England 2nd Test: ఔట్ అయిన అసహనంలో విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసా?

20 పరుగులకే ఔట్
రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 20 పరుగులకే ఔట్ అయిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ శామ్ కరన్ ఆఫ్ స్టంప్కి వెలుపలగా విసిరిన బంతిని వెంటాడిన కోహ్లీ (20: 31 బంతుల్లో 4x4).. వికెట్ కీపర్ జోస్ బట్లర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లీ వికెట్ దక్కడంతో కరన్ మైదానంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు.
గాల్లోకి ఎగురుతూ తనడైన శైలిలో పంచ్లు విసిరాడు. తీవ్ర నిరాశలో పెవిలియన్కి వెళ్లిన కోహ్లీ.. తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. డ్రెస్సింగ్ రూములో కోహ్లీ తన టవల్తో చెమటలు తుడుచుకుని.. అదే టవల్ను అద్దానికి విసిరికొట్టాడు. ఈ ఘటన అక్కడి కెమెరాలో రికార్డు అయింది. అది కాస్త నెట్టింట వైరల్ అయింది. కోహ్లీకి దూకుడు ఎక్కువే అంటూ ఫాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

ఉత్కంఠభరితంగా మ్యాచ్
భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు రోజులు గడిచేకొద్దీ ఉత్కంఠకరంగా మారుతోంది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండటంతో ఆటగాళ్లు ఒకరినొకరు కవ్వించుకొనేందుకూ వెనుకాడటం లేదు. మూడో రోజు జస్ప్రీత్ బుమ్రాను దూషించిన జేమ్స్ అండర్సన్ నాలుగో రోజైన ఆదివారం విరాట్ కోహ్లీనీ మాటలన్నాడు. దాంతో టీమిండియా కెప్టెన్ సైతం అతడికి ఘాటుగానే బదులిచ్చాడు.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 364 పరుగులు చేయగా ఇంగ్లండ్ 391 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. చెతేశ్వర్ పుజారా (45; 206 బంతుల్లో 4×4), అజింక్య రహానే (61; 146 బంతుల్లో 5×4) జట్టును ఆదుకున్నారు. రిషబ్ పంత్ (14), ఇషాంత్ శర్మ (4) అజేయంగా నిలిచారు. సోమవారం ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications












