అఫ్గానిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ ఏకైక టెస్ట్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అఫ్గాన్, న్యూజిలాండ్ ఆటగాళ్లు బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా అఫ్గాన్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్న బీసీసీఐ.. ఆ జట్టు అంతర్జాతీయ మ్యాచ్లను భారత్లోనే నిర్వహించుకునేందుకు సహకరిస్తోంది.
ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ నోయిడాలోని క్రికెట్ స్టేడియాన్ని ఇచ్చింది. అయితే ఏ మాత్రం నిర్వహణ సరిగ్గా లేని ఈ స్టేడియంపై ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడంతో పాటు నీటి సదుపాయం కూడా లేవని మండిపడుతున్నారు. వాష్ రూమ్స్లో సరిగ్గా వాటర్ రావడం లేదని, మహిళల కోసం కేటాయించిన వాష్ రూమ్స్ను కూడా కామన్గా వాడుకునే పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు.

తాజాగా నోయిడా మైదాన సిబ్బంది వాష్ రూమ్స్లో తినే ప్లేట్లను శుభ్రం చేస్తున్న ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్గా ఈ ఘటనపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఘాటుగా స్పందించింది. స్టేడియంలో సరైన సౌకర్యాలు లేని కారణంగా అఫ్గానిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు.
షెడ్యూల్ ప్రకారం సోమవారం ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది.
వర్షం లేకున్నా.. సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడంతో ఔట్ ఫీల్డ్ పూర్తిగా తడిగా ఉంది. స్టేడియం మొత్తానికి కావాల్సిన కవర్స్ కూడా అందుబాటులో లేవు.
తడి ఔట్ ఫీల్డ్ కారణంగా తొలి రోజు ఆట రద్దయింది. అంతకుముందు చేరిన వర్షపునీటిని మైదాన సిబ్బంది తొలగించలేకపోయారు. పేలవమైన డ్రైనేజి వ్యవస్థ ఓ రోజు ఆటకు అడ్డంకిగా మారింది.
ఒక్క బంతిని అయినా వేయించాలని సాయంత్రం 4.15 గంటల వరకు అంపైర్లు ఎదురుచూశారు. కానీ అది సాధ్యం కాలేదు. అంతేకాదు, రెండో రోజు ఆట కూడా ఇంకా ప్రారంభంకాలేదు. నొయిడా స్టేడియంపై బీసీసీఐ 2017లోనే నిషేధం విధించింది. ఇక్కడ జరిగిన ఓ కార్పోరేట్ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
అప్పటి నుంచి ఇక్కడ బీసీసీఐ అనుబంధిత టోర్నీ ఒక్కటి జరగేలేదు. అంతేకాకుండా ఈ స్టేడియం ఏ రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో లేదు.
గ్రేటర్ నొయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఈ స్టేడియాన్ని చూసుకుంటుంది. ఈ స్టేడియానికి కనీస మౌళిక సదుపాయాలు, సిబ్బంది కూడా లేరు. ఇక డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది.