అఫ్గానిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం నోయిడా వేదికగా సోమవారం ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. అర్థరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది.
సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడంతో మైదాన సిబ్బంది ఎంత కష్టపడినా.. ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ మ్యాచ్కు సరైన వసతులు లేని నోయిడా మైదానాన్ని కేటాయించారంటూ అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. నీటి సదుపాయం కూడా లేకపోవడంతో వాష్ రూమ్స్లో తినే ప్లేట్స్ను క్లీన్ చేస్తున్నారని, మహిళల వాష్ రూమ్స్ను కూడా పురుషులు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. అఫ్గాన్ క్రికెట్కు అండగా ఉంటున్న బీసీసీఐ.. ఆ దేశ హోమ్ మ్యాచ్లను భారత్లో ఆడుకునే వెసులు బాటు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే అఫ్గానిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ ఏకైక టెస్ట్కు నోయిడా మైదానాన్ని కేటాయించింది. అయితే ఈ నొయిడా స్టేడియంపై బీసీసీఐ 2017లోనే నిషేధం విధించింది. ఇక్కడ జరిగిన ఓ కార్పోరేట్ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
అప్పటి నుంచి ఇక్కడ బీసీసీఐ అనుబంధిత టోర్నీ ఒక్కటి కూడా జరగలేదు. అంతేకాకుండా ఈ స్టేడియం ఏ రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో లేదు. గ్రేటర్ నొయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఈ స్టేడియాన్ని చూసుకుంటుంది. దాంతో ఈ స్టేడియం నిర్వాహణ అధ్వాన్నంగా తయారైంది. కనీస మౌళిక సదుపాయాలతో పాటు సిబ్బంది కూడా లేరు. ఇక డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది.
గతంలో కూడా అఫ్గానిస్థాన్ ఇక్కడ మ్యాచ్లు ఆడింది.
అయితే ఈ మైదానం ఎంపిక విషయంలో బీసీసీఐ తప్పులేదని, తామే నోయిడా మైదానాన్ని ఎంచుకున్నామని అఫ్గాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) అధికారి మెహ్నాజుద్దీన్ రాజ్ స్పష్టం చేశారు. తమకు దగ్గరగా ఉంటుందనే నోయిడా మైదానాన్ని ఎంచుకున్నామని చెప్పారు. 'అఫ్గాన్-న్యూజిలాండ్ ఏకైక టెస్ట్ కోసం బీసీసీఐ.. కాన్పూర్, బెంగళూరుతో పాటు గ్రేటర్ నోయిడా మైదానాలను ఆఫర్ చేసింది.
మేం గ్రేటర్ నోయిడాను ఎంచుకున్నాం. ఎందుకంటే ఇది ఢిల్లీకి దగ్గరగా ఉంటుందని, కాబుల్ నుంచి ఈజీగా రావచ్చని భావించాం. ప్రయాణల పరంగా ఇదే మాకు అత్యుత్తమ వేదిక. అందుకే ఈ మైదానాన్ని ఎంచుకున్నాం.'అని చెప్పుకొచ్చారు.