ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ఆల్టైమ్ ఎలెవన్ ప్రకటించాడు. అయితే ఈ జట్టులో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అవకాశం ఇవ్వలేదు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో టాప్ స్కోరర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీని ఆడమ్ గిల్క్రిస్ట్ పరిగణలోకి తీసుకోకపోవడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఎంపిక చేసిన ఆల్టైమ్ వరల్డ్ బెస్ట్ టీ20 ఎలెవన్లోనూ విరాట్ కోహ్లీకి అవకాశం దక్కలేదు. తాజాగా ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా కోహ్లీని విస్మరించడం అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.
స్ట్రైక్రేట్ను పరిగణలోకి తీసుకొనే కోహ్లీని పక్కన పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కోహ్లీ టీ20 ఫార్మాట్లో ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్.. ప్రపంచంలోనే అత్యుత్తమైనదని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఆర్సీబీకి కూడా కోహ్లీ ఎన్నో విజయాలు అందించాడని కామెంట్ చేస్తున్నారు.

ఆడమ్ గిల్ క్రిస్ట్ తన ఆల్టైమ్ ఐపీఎల్ ఎలెవన్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకే ఎక్కువ అవకాశం ఇచ్చాడు. ఈ రెండు జట్లు 10 టైటిల్స్ గెలవడంతోనే వారికి గిల్ క్రిస్ట్ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ఆల్టైమ్ ఎలెవన్కు గిల్ క్రిస్ట్.. మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్గా ఎంపిక చేశాడు. అతనితో పాటు సీఎస్కేకు చెందిన సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను కూడా తీసుకున్నారు. సురేశ్ రైనాను తీసుకోవడంతోనే కోహ్లీకి ఈ జట్టులో చోటు దక్కలేదు. ముంబై ఇండియన్స్ నుంచి ఐదుగురు ఆటగాళ్లను తీసుకున్నాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేసిన గిల్ క్రిస్ట్.. సునీల్ నరైన్, డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్కు చోటిచ్చాడు.
ఆడమ్ గిల్క్రిస్ట్ ఎంపిక చేసిన ఆల్టైమ్ ఐపీఎల్ ఎలెవన్:
ధోనీ(కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా, భువనేశ్వర్ కుమార్.