ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ తన అత్యుత్తమ ఆల్టైమ్ వికెట్ కీపర్ల వివరాలను వెల్లడించాడు. మొత్తం ముగ్గురి వికెట్ కీపర్ల పేర్లు చెప్పిన గిల్ క్రిస్ట్.. టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి అవకాశం ఇచ్చాడు.
ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రకటించిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో మొదటి స్థానం తన రోల్ మోడల్ అయిన ఆసీస్ మాజీ వికెట్ కీపర్ రాడ్నీ మార్ష్ను ఎంచుకున్నాడు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీని తీసుకున్న గిల్క్రిస్ట్.. మూడో వికెట్ కీపర్గా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు అవకాశం ఇచ్చాడు.

'రాడ్నీ మార్షల్ నా మెంటార్. ఆయనలా గొప్ప వికెట్ కీపర్ కాపాడుకోవాలనే లక్ష్యంతో ఉండేవాడిని. మహేంద్ర సింగ్ ధోనీలో అతని ప్రశాంతత ఇష్టం. పరిస్థితులతో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా ఉంటూ పనిచేసుకుంటూ వెళ్లేవాడు. కుమార సంగక్కర క్లాసిక్ ప్లేయర్. బ్యాటింగ్లో సత్తా చాటడంతో పాటు అతని కీపింగ్ నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి'అని గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.
మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వికెట్ వెనుక అతను ఎంతో చురుకుగా ఉంటాడు. రెప్పపాటు సమయంలో స్టంపౌట్ చేయడం.. సూపర్ డైవ్స్తో క్యాచ్లు అందుకోవడం వికెట్ కీపర్గా ధోనీ స్పెషాలిటీ. అంతేకాకుండా బ్యాటర్ల ఫుట్వర్క్ తగ్గట్లు బౌలర్లకు సలహాలు, సూచనలు ఇవ్వడం, వ్యూహాలు రచించడం, బ్యాటర్లను బోల్తా కొట్టించడం అతని ప్రత్యేకత.

ఈ ఏడాది జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియానే కైవసం చేసుకుంటుందని గిల్ క్రిస్ట్ జోస్యం చెప్పాడు. 'స్వదేశంలో సత్తా చాటాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా ఉంది. విదేశాల్లో భారత్కు విజయాలు సాధించడం తెలుసు. అయితే, ఈసారి ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. ఇరు జట్ల మధ్య పోరు మాత్రం తీవ్రంగా ఉంటుంది.'అని గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.