న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ కోసం సిద్దమవుతున్న టీమిండియా.. తమ ఆటగాళ్ల వర్క్లోడ్మేనేజ్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్లకు విశ్రాంతినిచ్చింది. అంతకుముందు వెస్టిండీస్ పర్యటనలోనూ.. ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లను సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చింది.
అయితే సూపర్ ఫిట్గా ఉండే విరాట్ కోహ్లీ పదే పదే రెస్ట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ వరుసగా ఆడించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే 100 సెంచరీల రికార్డును అధిగమిస్తాడనే కోహ్లీకి రెస్ట్ ఇస్తున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది.

తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరిగింది. 'సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడనే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీని కొన్ని రోజులుగా వరుసగా మ్యాచులు ఆడించడం లేదు.' అని ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా దుమారం రేపింది. కోహ్లీ ఫ్యాన్స్తో పాటు ముంబైకి చెందిన ఆటగాళ్ల అభిమానుల మధ్య మాటల యుద్దం నడిచింది. ఈ వ్యవహారాన్ని గుర్తించిన గిల్ క్రిస్ట్.. సదరు పోస్ట్పై స్పందించాడు. 'నేను ఇలా ఎప్పుడూ చెప్పలేదు...' అంటూ వివరణ ఇచ్చాడు. తాను అనని మాటలను అన్నట్లుగా తన పేరిట ప్రచారం చేయడం చూసి అవాక్కయ్యాడు.
టీమిండియా ప్రపంచకప్ కాంబినేషన్ అద్భుతంగా ఉందని ఆడమ్ గిల్ క్రిస్ట్ ఇటీవల కొనియాడాడు. కేఎల్ రాహుల్ గైర్హాజరీలతో ఇషాన్ కిషన్ సత్తా చాటాడని, జట్టుకు ఇది శుభపరిణామమని తెలిపాడు. తన అంచనా ప్రకారం భారత్, పాకిస్థాన్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్రపంచకప్ ఫైనల్ చేరుతాయని జోస్యం చెప్పాడు.