టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటరని సౌతిండియా స్టార్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ తెలిపింది. బెంగళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. ఆర్సీబీకి తాను డై హార్డ్ ఫ్యాన్ అని, కోహ్లీ ఐపీఎల్ టైటిల్ అందుకోవడం తన కలని చెప్పింది.
ఐపీఎల్ 2024 సీజన్లో అది జరుగుతుందనే నమ్మకంతో ఉన్నానని పేర్కొంది. ప్రస్తుతం వర్ష బొల్లమ్మ 'ఊరు పేరు బైరవకోన'అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమెను.. క్రికెట్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు చెప్పింది.

'విరాట్ కోహ్లీ నా అభిమాన క్రికెటర్. ఆయన కోసమే నేను ఐపీఎల్ చూడటం మొదలుపెట్టాను. కోహ్లీ ఐపీఎల్ టైటిల్ అందుకోవడం నా కల. ఈ సారి అది జరుగుతుందని ఆశిస్తున్నాను. కచ్చితంగా ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుంది.'అని వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఆర్సీబీ అంటే ఏమోషన్ అని, వర్ష బొల్లమ్మ నిరూపించిందని ఆ జట్టు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాలతో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ వర్ష బొల్లమ్మ. తెలుగులో ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

ప్రస్తుతం ఆమె నటించిన 'ఊరు పేరు భైరవకోన' సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తొలి మ్యాచ్లో ఆర్సీబీ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ 22 మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే వెల్లడించింది. మిగతా మ్యాచ్ల వివరాలను ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ప్రకటించనుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ.. కుటుంబంతో లండన్లో ఉన్నాడు. ఇటీవలే అతని సతీమణి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ వారసుడికి విరుష్క అకాయ్ అని పేరు పెట్టుకుంది. విరాట్ కోహ్లీ నేరుగా ఐపీఎల్ 2024 సీజన్ ఆడే అవకాశం ఉంది.