ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీపై బెంగాల్ నటి స్వస్తికా ముఖర్జీ సంచలన ఆరోపణలు చేశారు. స్విగ్గీ డెలివరీ భాయ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్కు సంబంధించిన తమ టికెట్లను దొంగలించాడని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గత బుధవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే క్రికెట్ అంటే ఇష్టపడే తన తండ్రి కోసం తొలి టీ20 మ్యాచ్కు సంబంధించిన రెండు టికెట్లను ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు స్వస్తికా ముఖర్జీ పేర్కొన్నారు.

సదరు వ్యక్తి నుంచి టికెట్లను తన తండ్రికి పంపించేందుకు స్విగ్గిలో ఆర్డర్ చేశామని, అయితే డెలివరీ భాయ్ ఫోన్ నంబర్ బ్లాక్ చేసి టికెట్లు ఎత్తుకెళ్లాడని ఆరోపించారు. తన తండ్రి నివాసానికి వెళ్లలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై స్విగ్గీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని పోలీసులను కోరారు.
సదరు ఉద్యోగి ప్రత్యామ్నాయ నంబర్ ఇవ్వాలని కోరగా.. స్విగ్గీ సంస్థ నిరాకరించిందని కూడా స్వస్తికా ముఖర్జీ తన పోస్ట్లో రాసుకొచ్చారు. తన ఆర్డర్కు సంబంధించిన స్క్రీన్ షాట్ను కూడా పంచుకున్నారు. తన తండ్రికి క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ఇప్పటి వరకు ఆయన మైదానంలో మ్యాచ్ చూడలేదని పేర్కొన్నారు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్ కోసం ఆయన కాన్పూర్ నుంచి కోల్కతా వచ్చారని, కానీ టికెట్లను స్విగ్గీ డెలివరీ భాయ్ ఎత్తుకెళ్లాడని అసహనం వ్యక్తం చేసింది.
ఈ పోస్ట్ విషయంలో నెటిజన్లు స్వస్తికా ముఖర్జీకి అండగా కామెంట్ చేస్తున్నారు. స్విగ్గీ నుంచి తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయని రాసుకొస్తున్నారు. స్విగ్గీని నమ్మకూడదని నెటిజన్లకు సూచిస్తున్నారు. ఈ విషయంపై స్విగ్గీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఫుడ్ డెలివరీతో పాటు స్విగ్గీ ఇటీవలే ఇన్స్టామార్డ్ పేరిట కిరాణ సరకులను కూడా డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే.