ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ కొట్టిన తెలుగు తేజం, టీమిండియా యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నజరానా ప్రకటించింది. రూ. 25 లక్షల నగదు ప్రోత్సహాకాన్ని అందజేస్తామని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా నగదు పురస్కారం అందజేస్తామని చెప్పారు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ బ్యాటింగ్తో అరంగేట్ర శతకాన్ని అందుకున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి సంచలన బ్యాటింగ్తో టీమిండియాను గట్టెక్కించడమే కాకుండా శతకాన్ని సాధించాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ బ్యాటింగ్ను కొనియాడిన కేశినేని శివనాథ్.. హెచ్సీఏ తరఫున నగదు పురస్కారం ప్రకటించారు. అత్యాధునిక వసతులతో అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్లు ఆడేలా విశాఖ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు . ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ ఉండేలా ఏసీఏ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా పోరాడుతోంది. నితీష్ కుమార్ రెడ్డి(176 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 105 బ్యాటింగ్) అసాధారణ శతకంతో ఫాలో ఆన్ తప్పించుకున్న భారత్.. ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించే దిశగా సాగుతోంది. నితీష్ సంచలన శతకంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది.
క్రీజులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు మహమ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. నితీష్తో పాటు వాషింగ్టన్ సుందర్(162 బంతుల్లో ఫోర్తో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.